
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఏమి కలిసి రావడం లేదు. మూడు ఓటముల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ కొట్టింది. పంజాబ్ కింగ్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో 9 వికెట్లతో ఆరెంజ్ ఆర్మీ గెలుపొందింది. కేన్ విలియమ్సన్ జట్టులో చేరడంతో టీమ్ బ్యాలెన్సింగ్గా కనిపిస్తోంది. కానీ హైదరాబాద్ను ఇప్పుడు గాయాల బెడద వేదిస్తోంది.
ఇప్పటికే స్టార్ పేసర్ టీ నటరాజన్ మోకాలి గాయంతో బెంచ్కే పరిమితమవ్వగా.. కేన్ విలియమ్సన్ నిన్నటి మ్యాచ్తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాజాగా ఈ ఇంజ్యూరీ లిస్ట్లో భువనేశ్వర్ కుమార్ కూడా చేరాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతని తొడ కండరాలు పట్టేయడంతో బౌలింగ్ కోటా పూర్తి చేయకుండానే భువీ మైదానం వీడాడు.
గతేడాది కూడా గాయంతోనే జట్టును వీడిన భువీ.. మళ్లీ గాయపడటంతో సన్రైజర్స్ శిభిరంలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల గాయాలపై వార్నర్ స్పందించాడు. ముందుగా నటరాజన్ గాయంపై స్పందిస్తూ.. అతని మోకాలి గాయంపై సన్రైజర్స్ ఫిజియో టీమ్ పర్యవేక్షిస్తుందన్నాడు. 'నట్టూ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

క్వారంటైన్ రూల్ నిబంధనతో అతను స్కానింగ్ చేసుకునే పరిస్థితి లేదు. స్కానింగ్ చేసుకోవాలంటే అతను బబుల్ వీడాలి. మళ్లీ వచ్చి ఏడు రోజుల క్వారంటైన్ పాటించాల్సి ఉంటుంది. ఫిజియోలు అతని గాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కానీ ఎదో ఒక టైమ్లో అతను స్కానింగ్ చేసుకోవాల్సిందే'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ లెక్కన నట్టూ ఈ సీజన్ మొత్తానికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కానింగ్ కోసం బయో బబుల్ వీడి మళ్లీ జట్టుతో చేరాలంటే అతను వారం రోజుల క్వారంటైన్లో ఉండాలి. ఈ టైమ్లో సన్రైజర్స్ మరో రెండు మ్యాచ్లు ఆడేస్తుంది. గాయం చిన్నదైతే అతను సెకండాఫ్ మ్యాచ్లకు అందుబాటులోకి వస్తాడు. తీవ్రమైతే మాత్రం సీజన్కు దూరమైనట్లే. ఇక భువీ గాయంపై స్పందించిన వార్నర్.. తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడని తెలిపాడు. గాయం తీవ్రత గురించి ఇప్పుడే ఏం చెప్పలేమన్నాడు.
ఇక కేన్ విలియమ్సన్ తనగాయంపై స్పందిస్తూ పూర్తిగా కోలుకున్నానని తెలిపాడు. 'నా మోచేతికి చిన్న గాయమైంది. ప్రస్తుతం నయమైంది. మొత్తానికి గాయం నుంచి కోలుకొని తొలి మ్యాచ్ ఆడటం సంతోషంగా ఉంది. ఓ జట్టుగా గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ప్రతీ జట్టు బెస్ట్ కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తోంది. ఇదే జోరును ముందు ముందు కొనసాగిస్తామనుకుంటున్నా'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.