|
ముంబైకి షాక్..
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై రన్నరప్ ఢిల్లీ పై చేయి సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు.
పోరాడిన ధావన్, లలిత్..
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ధావన్కు స్మిత్ జతయ్యాడు. ముంబై బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా ఈ ఇద్దరు కుదురుగా ఆడారు. రెండో వికెట్కు 53 పరుగులు జతయ్యాక పొలార్డ్ బౌలింగ్లో స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ వెంటనే ధావన్, రిషభ్ పంత్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్పై ముంబై పట్టు బిగుస్తుందా అనిపించింది. లలిత్ యాదవ్ (25 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విలువైన పోరాటం చేశాడు. విజయానికి 19 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన పరిస్థితుల్లో హెట్మెయిర్ (9 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి లలిత్ యాదవ్ ఢిల్లీ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
హైదరాబాద్ ఉంటే ఓడిపోయేది..
ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ స్థానంలో హైదరాబాద్ ఉంటే ఖచ్చితంగా ఓడిపోయేదని, 19 బంతుల్లో 23 పరుగులు చేయడం కూడా సన్రైజర్స్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్కు చేత కాదని ఆ జట్టు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్లో లలిత్ యాదవ్ పోషించిన పాత్రను హైదరాబాద్లో ఏ యువ ఆటగాడు రాణించడం లేదని మండిపడుతున్నారు. గత మూడు మ్యాచ్ల్లో హైదరాబాద్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఓటమికి తలవంచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీని చూసైనా బుద్ది తెచ్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.