
దుబాయ్: విజయానందంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు గట్టి షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్కు కారణమైన ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్కు భారీ జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోపు ఓవర్లను పూర్తి చేయకపోవడంతో మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ ఐపీఎల్ నిబంధనల మేరకు శాంసన్పై రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ చర్యలు తీసుకున్నారు. 'రాజస్థాన్ రాయల్స్ మొదటిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసిందని, ఐపీఎల్ నిబంధనల మేరకు కెప్టెన్ శాంసన్పై రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నాం'అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఒక ఐపీఎల్ నిబంధనల మేరకు జట్టు మొదటిసారి స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే.. సదరు జట్టు కెప్టెన్కు రూ. 12 లక్షల జరిమానా విధించనున్నారు. రెండోసారి అదే పునరావృతం అయితే.. ఆ జట్టు కెప్టెన్కు రూ. 24 లక్షల జరిమానాతో పాటు జట్టులోని సభ్యులందరి ఫీజులో నుంచి రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధించనున్నారు. ఇక మూడోసారి కూడా అదే రిపీట్ అయితే మాత్రం కెప్టెన్కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్ ఫీజులో నుంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు.
ఇక పంజాబ్తో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన పంజాబ్ను రాజస్థాన్ చివరి రెండు ఓవర్లలో కట్టిడి చేసి అద్భుత విజయాన్నందుకుంది. 6 బంతుల్లో 4 పరుగులు చేయలేక పంజాబ్ ఓటమికి తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (5/32) ఐదు వికెట్లతో దుమ్మురేపాడు.
అనంతరం చేజింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ రాహుల్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 67)రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అవ్వగా.. ఆఖరి ఓవర్లో కార్తీక్ త్యాగి అద్భుతం చేశాడు. రెండు వికెట్లు తీయడంతో పాటు ఒకే ఒక పరుగు ఇచ్చాడు.