
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న తమ ఫస్ట్ లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నయా కెప్టెన్ సంజూ శాంసన్ చేజింగ్కు మొగ్గు చూపాడు. కెప్టెన్ పాత్రను పోషించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. తన పనిని సులువు చేసేందుకు సంగక్కర అండగా ఉన్నాడని చెప్పాడు. ఇక రాజస్తాన్ తరఫున ముస్తాఫిజుర్ రెహ్మాన్, శివమ్ దూబే అరంగ్రేటం చేయగా.. పంజాబ్ కింగ్స్ తరఫున ముగ్గురు కొత్తవారు బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు క్రికెటర్ షారుఖ్ ఖాన్, బిగ్ బాష్ లీగ్ స్టార్స్ రిలే మెరిడిత్, జై రిచర్డ్సన్ అరంగేట్ర క్యాప్ అందుకున్నారు.
ఇక రాజస్థాన్ తరఫున ఓవర్సీస్ కోటాలో క్రిస్ మోరీస్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, ఫిజ్ బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ తరఫున క్రిస్ గేల్, పూరన్, మెరిడిత్, రిచర్డ్సన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని పంజాబ్ కెప్టెన్ రాహుల్ తెలిపాడు. అయినా ఈ సవాల్ను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నామన్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో క్రిస్ మోరీస్ కోసం రాజస్థాన్ అత్యధిక ధర వెచ్చించగా.. మెరిడిత్, జై రిచర్డ్సన్, షారుఖ్ ఖాన్లపై పంజాబ్ కోట్లు కుమ్మరించిన విషయం తెలిసిందే.
గత సీజన్లో చివరిస్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఈ సారి మెరుగైన ప్రదర్శన కనబర్చాలని భావిస్తుంది. అందుకోసం ఫస్ట్ మ్యాచ్లోనే శుభారంభం అందుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటి వరకు టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్.. గత సీజన్ మాదిరి కాకుండా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాలని భావిస్తోంది.
ఇక పంజాబ్, రాజస్థాన్ ముఖా ముఖి పరిశీలిస్తే.. 21 మ్యాచ్ల్లో రాజస్థాన్ 12 మ్యాచ్ల్లో గెలుపొందగా.. 9 మ్యాచ్ల్లో పంజాబ్ విజయం సాధించింది.
తుది జట్లు:
రాజస్థాన్: జోస్ బట్లర్, మనన్ వోహ్రా, బెన్ స్టోక్స్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, శివం దుబే, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్
పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, జై రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిలే మెరెడిత్, అర్ష్దీప్ సింగ్