
ఢాకా: కొన్ని నెలలుగా బయో బబుల్లో ఉంటూ మ్యాచ్ ఆడడం విసుగు తెప్పించిందని రాజస్థాన్ రాయల్స్ పేసర్, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తెలిపాడు. క్వారంటైన్లో ఉండటం నరకంలా అనిపించిందన్నాడు. కొన్నాళ్లు క్రికెట్కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడుపుతానని తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం న్యూజిలాండ్ పర్యటన అనంతరం నేరుగా భారత్కు వచ్చిన ముస్తాఫిజుర్.. రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 8 మ్యాచ్ల్లో 7 వికెట్లు తీశాడు. అయితే కరోనా కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవధికంగా వాయిదా పడటంతో ముస్తాఫిజుర్.. సహచర ఆటగాడు, కేకేఆర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్తో కలిసి తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్టడ్ ఫ్లైట్లో బంగ్లాదేశ్కు చేరుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్న అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
లీగ్ మధ్యలో ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడటంతో ఐసోలేషన్కు తరలించారని, ఐదారు రోజుల పాటు గదిలో ఒంటరిగా ఉండటమని నరకంగా అనిపించిందన్నాడు. 'ఇంటికి తిరిగివచ్చినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా బయో బబుల్లో ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించింది. మమ్మల్ని ఇంటికి క్షేమంగా పంపించినందుకు రాజస్తాన్ రాయల్స్కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. అయితే టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు కరోనా సోకడంతో మమ్మల్ని ఐదు నుంచి ఆరు రోజుల పాటు ఒకే రూంలో ఉంచారు. ఆ సమయంలో మాత్రం నాకు నరకంగా అనిపించింది. ఇప్పుడు ఇంటికి చేరడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. కొన్నిరోజుల పాటు క్రికెట్కు విరామమిచ్చి కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.