
ఆరంభాన్ని కొనసాగించలేక..
'మేం కొన్ని తప్పిదాలు చేశాం. మాకు మంచి శుభారంభం దక్కింది. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. కానీ ఆ ఆరంభాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయాం. శుభారంభాన్ని అందిపుచ్చుకొని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అలాగే బౌలింగ్లోను ఆరంభంలో విఫలమయ్యాం. దారళంగా పరుగులిచ్చుకున్నాం. ఈ తప్పిదాలను లోతుగా విశ్లేషించాలి. అయితే క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజం. ముందుకు సాగాలంతే.

అంత ఈజీ కాదు..
నేను, డికాక్ శుభారంభం చేశాక మరికొన్ని కీలక భాగస్వామ్యాలు నిర్మించాల్సింది పోయి వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అలాగే ఎవరైనా క్రీజులోకి రాగానే దంచికొట్టడం అనేది అంత సులువుకాదు. గత మ్యాచ్లోనూ ఇలాగే జరిగింది. దీనిమీద దృష్టి సారిస్తాం. ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకున్న అనుభవం మాకుంది. ఈసారి కూడా రాణిస్తాం. ఇక పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నామనే విషయం ఎప్పుడూ మదిలో ఏ మూలనో ఉంటుంది. అయితే ఎక్కడ ఉన్నామనే విషయం తెలుసుకోవడం ముఖ్యం. ప్రస్తుతమైతే మంచి పొజిషన్లో ఉన్నాం. మిగతా మ్యాచ్ల్లో పోరాడి వరుస విజయాలు సాధిస్తాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

అయ్యారే.. అయ్యర్..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 55) హాఫ్సెంచరీతో రాణించాడు.ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత చేజింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 15.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 74 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) చెలరేగారు.
కోల్కతా కోల్పోయిన మూడు వికెట్లు బుమ్రాకే దక్కాయి. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠిలకు కాకుండా రోహిత్ శర్మ వికెట్ తీసిన స్పిన్నర్ సునీల్ నరైన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'అవార్డు దక్కడం విషేషం.

క్లిష్టస్థితిలో రోహిత్ సేన..
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్లో ముంబైకి ఇది వరుసగా రెండో విజయం. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తయిన ముంబై.. తాజాగా కోల్కతా చేతిలోనూ ఓటమిపాలైంది. దాంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి పడిపోయింది. ఫస్టాఫ్ హాఫ్ మ్యాచ్లు ముగిసేసరికి 4 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్న రోహిత్ సేన... ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది.
ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకొంది. ముంబై ఇంకా ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే రోహిత్ సేన కనీసం నాలుగు గెలవాలి. లేకుంటే మెరుగైన రన్రేట్తో 3 మ్యాచ్ల్లో గెలుపొందాలి. ముంబై తమ తదుపరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభంకానుంది.


Click it and Unblock the Notifications












