
చివరి ఓవర్లో 23 పరుగులు
నిజానికి బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కెప్టెన్ రిషబ్ పంత్ తప్పిదం కారణంగా కోహ్లీసేన మెరుగైన స్కోరు చేయగలిగింది. బెంగళూరు 19 ఓవర్లు ముగిసే సరికి 148/5తో ఉంది. ఈ సమయంలో అప్పటి వరకూ కనీసం ఒక్క ఓవర్ కూడా వేయని ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్తో పంత్ బౌలింగ్ చేయించాడు. స్టోయినిస్ లయ అందుకునేలోపే ఏబీ డివిలియర్స్ పనికానిచ్చేశాడు. స్టోయినిస్ ఆ ఓవర్లోని మొదటి బంతిని వైడ్గా వేశాడు. ఆపై 2, 6, 0, 6, 6, 2 ఇచ్చాడు. మొత్తంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బెంగళూరుని 171/5తో ఇన్నింగ్స్ను ముగించింది.

మిశ్రా తెలివిగా బౌలింగ్ చేసినా
అప్పటివరకు సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అయినా కూడా మిశ్రాతో నాలుగు ఓవర్ల కోటాని రిషబ్ పంత్ పూర్తి చేయించలేకపోయాడు. ఇక చివరి ఓవర్ వచ్చే సమయానికి పేసర్లు ఇషాంత్ శర్మ, కాగిసో రబాడ, అవేష్ ఖాన్.. స్టార్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఓవర్ల కోటా ముగిసింది. దాంతో ఏబీ డివిలియర్స్ క్రీజులో ఉండటంతో స్పిన్నర్ వద్దనుకుని.. మార్కస్ స్టోయినిస్తో పంత్ బౌలింగ్ చేయించాడు. ఒకవేళ మిశ్రాతో బౌలింగ్ చేయించి ఉన్నా.. అంతలా పరుగులిచ్చేవాడు కాదని మ్యాచ్ కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు.
DC vs RCB: మ్యాచ్ పోయిందనుకున్నా.. సిరాజ్, ఏబీకి హ్యాట్పాఫ్: కోహ్లీ

రెండు ఫోర్లు బాదినా
లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హిట్మెయర్.. కైల్ జేమిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి 21 పరుగులు రాబట్టాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం చివరి 12 బంతుల్లో 25 పరుగులుగా మారింది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో 11 పరుగులు చేయడంతో.. చివరి ఓవర్లో ఢిల్లీకి 14 రన్స్ అవసరం అయ్యాయి. మంచి ఊపుమీదున్న హిట్మెయర్కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేశాడు. రెండు ఫోర్లు బాదినా.. అవి ఢిల్లీ విజయానికి సరిపోలేదు. ఒకవేళ హిట్మెయర్కు స్ట్రైకింగ్ ఇచ్చిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

మిశ్రా కనబడలేదా నాయనా
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ప్రధాన తప్పిదాల కారణంగా తన జట్టు ఓటమికి కారణమయ్యాడు. సోషల్ మీడియాలో పంత్పై విమర్శల వర్షం కురుస్తోంది. 'ఆఖరి ఓవర్పై పంత్కు ముందు చూపు లేకపోయింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'పంతే ఢిల్లీ కొంపముంచాడు' అని మరొకరు ట్వీట్ చేశారు. 'అమిత్ మిశ్రా కనబడలేదా నాయనా?' 'పోయిపోయి స్టోయినిస్ దొరికాడా?', 'హిట్మెయర్కు ఎందుకు స్ట్రైకింగ్ ఇవ్వలేదు' అని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచులో పంత్ హాఫ్ సెంచరీ (58 నాటౌట్) చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
