అందుకే స్టోయినిస్తో ఆఖరి ఓవర్ వేయించా: రిషభ్ పంత్

అహ్మదాబాద్: ఓవర్ ఓవర్కు ఆధిపత్యం చేతులు మారుతూ.. ఆఖరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠగా సాగుతూ.. ఫ్యాన్స్కు ఫుల్ కిక్కిచ్చిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి రిషభ్ పంత్ చెత్త కెప్టెన్సీనే కారణమని మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా విమర్శించారు. బౌలర్లను ఉపయోగించుకునే విషయంలో పంత్ విఫలమయ్యాడని చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ చేతికి బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మండిపడ్డారు. అయితే స్పిన్నర్లు ఆశించిన మేర రాణించకపోవడంతోనే చివరి ఓవర్ను మార్కస్ స్టోయినిస్కు ఇవ్వాల్సి వచ్చిందని మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్ తెలిపాడు.

అదే ప్లాన్..
'ఓడిపోయినప్పుడు బాధగానే ఉంటుంది. ముఖ్యంగా ఇలా విజయానికి దగ్గరగా వచ్చి ఓటమిపాలవ్వడం కష్టంగా ఉంటుంది. ఈ వికెట్పై ఆర్సీబీ 10-15 పరుగులు అదనంగా చేసింది. మా జట్టులో షిమ్రన్ హెట్మైర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని విధ్వంసంతోనే మేం టార్గెట్కు అతి చేరువగా వచ్చాం. ఆఖరి ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేసే క్రమంలో మా ఇద్దరిలో ఎవరికి బ్యాటింగ్ వచ్చినా హిట్టింగ్ చేయాలనుకున్నాం. అదే మా ప్లాన్. కానీ చివరి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలయ్యాం.

స్పిన్నర్లు రాణించకపోవంతో..
మేం ఆశించిన స్థాయిలో స్పిన్నర్లు రాణించలేదు. దాంతో చివరి ఓవర్ను స్టోయినిస్కు ఇవ్వాల్సి వచ్చింది. యంగ్ టీమ్గా ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ల్లో సానుకూల అంశాలను మాత్రమే తీసుకుని ముందుకు సాగుతున్నాం. ప్రతీ మ్యాచ్ నుంచి ఏదొక విషయం నేర్చుకుంటూ మరింత మెరుగవుతున్నాం'అని చెప్పుకొచ్చాడు. నిజానికి బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ మార్కస్ స్టోయినిస్ వేసిన చివరి ఓవర్లో ఏబీ డివిలియర్స్ మూడు సిక్సర్లు, ఓ ఫోర్తో 23 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేయగలిగింది.

అమిత్ మిశ్రాతో..
మిడిల్ ఓవర్లలో అమిత్ మిశ్రాతో బౌలింగ్ చేయించి.. చివర్లో అవేశ్ ఖాన్ లేదా రబడాతో బౌలింగ్ చేయించుంటే ఇంత నష్టం జరిగేది కాదని చాలా మంది ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డాడు. అమిత్ మిశ్రా పొదుపుగానే బౌలింగ్ చేశాడని, డేంజరస్ గ్లేన్ మ్యాక్స్వెల్ను పెవిలియన్ చేర్చాడని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా పంత్ అత్యుత్సాహం కారణంగా ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయిందని కామెంట్ చేస్తున్నారు. బౌలర్లను వాడుకునే విషయంలో రిషభ్ పంత్ జాగ్రత్తగా ఉండాలని సెహ్వాగ్ చురకలంటించాడు.

చివరి బంతికి సిక్స్ కొట్టలేక..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఏబీ డివిలియర్స్ (42 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్ పటిదార్ (22 బంతుల్లో 31; 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్ పంత్ 58 నాటౌట్), షిమ్రాన్ హెట్మైర్ ( 53 నాటౌట్;) అర్ధ సెంచరీలు సాధించినా పరుగు దూరంలో ఆగిపోయి ఓటమి చవిచూశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications