
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్కు నిరాశే ఎదురైంది. గత మూడేళ్లుగా టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆ జట్టుకు ఈసారి కూడా కలిసిరాలేదు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన టేబుల్ టాపర్గా నిలిచిన పంత్ సేన.. కీలక క్వాలిఫయర్స్ మ్యాచ్ల్లో చేతులెత్తేసింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్లో చేజేతులా మ్యాచ్ను చేజార్చుకున్న ఢిల్లీ.. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో కేకేఆర్ 3 వికెట్లతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
గెలుపు కోసం చివరివరకు పోరాడిన ఢిల్లీకి నిరాశే ఎదురైంది. దాంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చినా టైటిల్ అందుకోకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అభిమానులు సైతం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాడ్ లక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసి ఓ బంతి మిగిలుండగానే గెలుపొందింది. వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా..శుభ్మన్ గిల్ (46 బంతుల్లో ఫోర్, సిక్స్తో 4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఓపెనర్లిద్దరు తొలి వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో ఓ దశలో కేకేఆర్ సునాయసంగా గెలుస్తుందనిపించింది. కానీ రబడా వేసిన 18వ ఓవర్లో ఓ వికెట్ తీసి 1 పరుగు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి 12 బంతుల్లో కేకేఆర్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. అన్రిచ్ నోర్జ్ వేసిన 19వ ఓవర్లో మూడు పరుగులిచ్చే ఓ వికెట్ తీయడంతో మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపు మళ్లీంది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. బంతిని అందుకున్న అశ్విన్ వరుసగా రెండు వికెట్లు తీశాడు. దాంతో చివరి రెండు బంతులకు కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్ కొట్టడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది.