
చెన్నై: దేశంలో అప్పుడే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ సందడి మొదలైంది. మరో 6 రోజుల్లో ఈ క్యాష్రిచ్ లీగ్ 14వ ఎడిషన్కు తెరలేవనుంది. ఈ క్రమంలో ట్విటర్ ఇండియా తమ యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఫ్రాంచైజీల ఏమోజీలను విడుదల చేసింది. అయితే ఈ ఏమోజీల విషయంలో ట్విటర్ ఇండియా ఘోర తప్పిదం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జెర్సీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఏమోజీగా పేర్కొంది.
ఈ తప్పిదాన్ని గుర్తించిన అభిమానులు వెంటనే ట్విటర్ ఇండియాను ట్రోల్ చేశారు. అలాగే ఆర్సీబీ టీమ్పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆర్సీబీపై తమదైన శైలిలో సెటైర్ వేసింది. సౌతిండియా సూపర్ స్టార్ ఆల్టైమ్ ఫేవరేట్ మూవీ 'నరసింహా'లోని ఓసీన్కు సంబంధించిన మీమ్ను షేర్ చేసింది. ఈ సీన్లో ఎర్ర చీర కట్టుకున్న దివంగత హీరోయిన సౌందర్యపై రజనీకాంత్ పసుపు నీళ్లు పోస్తాడు.
అయితే దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ట్విటర్ ఇండియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు మంచి టెక్ ఇంజనీర్ను నియమించుకోవాలని, ఉద్యోగ నియమకాలను చేపట్టడానికి బెంగళూరు సరైన ప్రదేశమని చురుకలంటించింది. 'హే ట్విటర్, ట్విటర్ ఇండియా.. మీరు వెంటనే ఓ మంచి టెక్ ఇంజనీర్ను నియమించుకోండి. నియమకాలు చేపట్టడానికి బెంగళూరు అనువైన ప్రదేశం. ఇక్కడే మొదలుపెట్టండి. #WhatsWithYourEmojis అనే యాష్ ట్యాగ్తో ట్వీట్ చేసింది.
ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏప్రిల్ 9న జరిగే సీజన్ ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే చెన్నై వేదికగా క్యాంప్ ఏర్పాటు చేసిన ఆ జట్టు.. టైటిలే లక్ష్యంగా ముమ్మరంగా సాధన చేస్తోంది.