
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్కు దూరమవుతాడనే ఊహాగానాలకు తెరదించుతూ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుతో కలిసాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి టీమిండియాకు దూరమైన జడేజా పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలోనే క్వారంటైన్ పూర్తి చేసుకున్న అతను గురువారం సీఎస్కే క్యాంప్లో చేరాడు. ఎల్లో జెర్సీలో సహచర ఆటగాడు సురేశ్ రైనాతో కలిసి దిగిన ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది. జడేజా రాకతో అటు అభిమానులు ఇటు ఫ్రాంచైజీలో ఉత్సాహం నెలకొంది.
గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన జడ్డూ సీఎస్కే క్యాంప్లో చేరడానికి ముందే ట్రైనింగ్ను ప్రారంభించాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9 నుంచి ఆరంభంకానుండగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ఈ సీజన్కు అన్ని విధాల సమయాత్తం అవుతున్న చెన్నై.. అందరికన్నా ముందే ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై వేదికగా ముమ్మరంగా సాధన చేస్తోంది.
లీగ్లో ఎన్నడూ లేని విధంగా గతేడాది తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన చెన్నై.. ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇందుకోసం ఆటగాళ్లు చాలా కష్టపడుతున్నారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా నెట్స్లో చెమటోడ్చారు. ఈ ఇద్దరు ఫీల్డింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చెన్నై తన ట్విటర్లో పోస్ట్ చేసింది. మహీతో కోచులు స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సిలు చర్చలు జరిపారు.
ప్రాక్టీస్ చేసేముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన బ్యాటును సరిచేసుకున్నాడు. డ్రిల్లింగ్ మిషన్ సాయంతో తన బ్యాటు బరువును తగ్గించాడు. ఆపై మైదానంలో చెక్ చేశాడు. ఇక వ్యక్తిగత కారణాలతో గత సీజన్ ఆడని సురేష్ రైనా కూడా మూడు బ్యాట్లతో మైదానంలోకి దిగాడు. ఆపై భారీ షాట్లు ఆడాడు. పక్కనే ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై ఆటగాళ్ల బ్యాటింగ్ సాధనను పర్యవేక్షించాడు.