కార్తీక్. నువ్వు కేక..
ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మ్యాచ్ విన్నర్గా నిలిచిన కార్తీక్ త్యాగీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక్క ఓవర్తో త్యాగీ ఓవర్నైట్ స్టార్ అయ్యాడని కామెంట్ చేస్తున్నారు. అప్పటికి మూడు ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయిన త్యాగి.. ఆఖరి ఓవర్లో అద్భుతం చేశాడని, కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి, నికోలస్ పూరన్, దీపక్ హుడాలను ఔట్ చేసి రాజస్థాన్ను గెలిపించాడని కొనియాడుతున్నారు. కార్తీక్ త్యాగీకి మంచి భవిష్యత్తు ఉందని, ఇలానే రాణిస్తే త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని అంచనా వేస్తున్నారు. టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా సైతం.. కార్తీక్ త్యాగి సూపర్ బౌలింగ్ను కొనియాడాడు.
నాది పంజాబ్ జట్టు కాదు..
పంజాబ్ ఓటమిని ఉద్దేశించి ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతీ జింతా పేరిట రూపొందించిన మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. నాది పంజాబ్ జట్టు కాదంటూ ప్రీతీ జింటా వెళ్లిపొతున్నట్లు మీమ్స్ క్రియేట్ చేశారు. ఇక కార్తీక్ త్యాగీ.. రాజస్థాన్ రాయల్స్ జట్టు సింగమ్ అంటూ సూర్య సినిమాకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయని, కానీ మూడు క్యాచ్లు వదిలేసినా రాజస్థాన్ను త్యాగీ గెలిపించాడని కామెంట్ చేస్తున్నారు. ఇక చెత్త కెప్టెన్సీ అంటూ ఆఖరి వరకు సంజూ శాంసన్ను తిట్టిన జనాలు ఇప్పుడేం అంటారని ప్రశ్నిస్తున్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్..
కొందరు పంజాబ్ డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల మ్యాచ్లను శాసిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్పై సమగ్ర విచారణ జరపాలని, లేకుంటే నాలుగు పరుగులు చేయకపోవడం ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్ గేల్ను పక్కనపెట్టి పంజాబ్ జట్టు మూల్యం చెల్లించుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్స్ బాస్ ఆడితే మ్యాచ్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్కు సంబంధించిన ట్రోల్స్, మీమ్స్ నెట్టింట వైరల్గా మారాయి.
రాహుల్, మయాంక్ రాణించినా..
ఈ మ్యాచ్లో ముందుగా రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43), ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (5/32) ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. అనంతరం చేజింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ రాహుల్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 67)రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో కార్తీక్ త్యాగి రెండు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అవ్వగా.. ఆఖరి ఓవర్లో కార్తీక్ త్యాగి అద్భుతం చేశాడు.


Click it and Unblock the Notifications












