ఒక్కటి గెలిచినా..
గత రెండు సీజన్లలో చూపెట్టిన జోరును ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్-14లోను కొనసాగించింది. కొత్త కెప్టెన్ రిషభ్ పంత్కు ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ సలహాలు, వ్యూహాలు తోడుకావడంతో ఫస్టాఫ్లో దుమ్మురేపింది. 8 మ్యాచ్లు ఆడితే ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరువగా వచ్చిన డీసీ.. ఇదే ఫామ్ను కొనసాగిస్తే కప్ కొట్టడం పెద్దగా కష్టం కాదు. భుజ గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావడం అతిపెద్ద సానుకూలాంశం. అయితే అనిరుధ్ జోషీ, క్రిస్ వోక్స్, స్పిన్నర్ సిద్ధార్థ్ లేకపోవడం లోటే అయినా.. దీనిని అధిగమించడం పెద్ద ఇబ్బంది కాదు. ఆసీస్ అన్క్యాప్డ్ పేసర్ బెన్ డ్వారుషిస్ను టీమ్లోకి తీసుకుంది. ఈ ఏడాది అత్యధిక రన్స్ చేసిన రేస్లో టాప్ స్లేస్లో ఉన్న శిఖర్ ధావన్(512), పృథ్వీ షా, అయ్యర్, స్మిత్, కెప్టెన్ పంత్తో బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటివరకు పవర్ప్లేతోనే మ్యాచ్లు మలుపు తిప్పిన స్ట్రాటజీని యూఏఈలోనూ కొనసాగించే అవకాశం ఉంది. బౌలింగ్లో అన్రిచ్ నోకియా, కగిసో రబాడతో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్ కీలకం కానున్నారు.
సీఎస్కే మళ్లీ..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై నిరుడు నిరాశపరిచినా.. ఈసారి పుంజుకుంది. 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మిగతా 7 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లేఆఫ్ బెర్తు పక్కా. రెండు నెగ్గినా ఛాన్సుంటుంది. గతేడాది యూఏఈలోనే జరిగిన సీజన్లో ఆ జట్టు ప్రదర్శన పేలవం. మళ్లీ ఇప్పుడు అక్కడ ఆడబోతుండటం ఆ జట్టుపై ప్రభావం చూపుతుందేమో చూడాలి. తొలి దశ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేసిన డుప్లెసిస్ ప్రస్తుతం గాయంతో బాధపడుతుండడం ఇబ్బందే. ఆల్రౌండర్లు జడేజా, మొయిన్ అలీ, సామ్ కరన్, బ్రావో ఆ జట్టుకు బలం.
ఆర్సీబీ.. ఈ సారైనా
ప్రతి సీజన్కు ముందు 'ఈసారి కప్ మాదే' అంటూ ముందుకొచ్చే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్-14 సెకండ్ ఫేజ్పై భారీ ఆశలు పెట్టుకుంది. ఫస్ట్ ఫేజ్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదింటిలో నెగ్గిన కోహ్లీసేన 10 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో కొనసాగుతోంది. అయితే మిగిలిన ఏడు మ్యాచ్ల్లో కనీసం రెండింటిలో గెలిచినా ఈజీగా ప్లే ఆఫ్స్కు చేరే చాన్స్ ఉంది. బ్యాటింగ్లో విరాట్, డివిలియర్స్పైనే ఎక్కువగా ఆధారపడకుండా మ్యాక్స్వెల్, పడిక్కల్, హర్షల్ పటేల్ నుంచి సహకారం అందితే కప్ కల నెరవేరే అవకాశాలున్నాయి. యూఏఈ ఫేజ్ కోసం టీమ్లో భారీ మార్పులు జరిగాయి. ఆడమ్ జంపా, డానియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, అలెన్ స్థానాల్లో వానిందు హసరంగ, దుష్మంత్ చమీరా, జార్జ్ గార్టన్, టిమ్ డేవిడ్ (సింగపూర్) టీమ్లోకి తీసుకున్నారు. లాస్ట్ ఐపీఎల్లో కీ రోల్ పోషించిన యజ్వేంద్ర చహల్ అరబ్ గడ్డపై కూడా మరోసారి మెరిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. సిరాజ్, జెమీసన్, సైనీ వంటి నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్నారు.
ముంబై జోరు కొనసాగుతుందా?
రికార్డు స్థాయిలో అయిదు సార్లు విజేతగా నిలిచిన ముంబై.. మరోసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో యూఈఏ చేరింది. గత సీజన్లో ఇదే గడ్డపై ట్రోఫీ సొంతం చేసుకున్న ఆ జట్టు.. దాన్ని పునరావృతం చేస్తుందా అన్నది చూడాలి. తొలి ఏడు మ్యాచ్ల్లో 4 విజయాలే సాధించిన ఆ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే ఏడు మ్యాచ్ల్లో ఆ జట్టుకు మూణ్నాలుగు విజయాలవసరం. కెప్టెన్ రోహిత్కు తోడు డికాక్, సూర్యకుమార్, హార్దిక్, కృనాల్, పొలార్డ్, బుమ్రా, బౌల్ట్ లాంటి మేటి ఆటగాళ్లున్న ముంబైకి అదేమంత కష్టమేమీ కాదు.
నాలుగు మార్పులతో రాజస్తాన్
పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్.. నాలుగు మార్పులతో సెకండ్ ఫేజ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వేర్వేరు కారణాలతో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ సేవలు కోల్పోయిన రాయల్స్.. వారి స్థానంలో ఓషేన్ థామస్ (వెస్టిండీస్), ఎవిన్ లూయిస్ ( వెస్టిండీస్). గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్)ను జట్టులోకి తీసుకుంది. ఇక, పేసర్ ఆండ్రూ టై కి రీప్లేస్మెంట్గా వరల్డ్ నంబర్వన్ బౌలర్ తబ్రైజ్ షంషీ (సౌతాఫ్రికా)ని జట్టులో చేర్చుకుంది. ఫస్ట్ ఫేజ్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో రెండు సార్లు 200కు పైగా రన్స్ చేయడం ఆ టీమ్ బ్యాటింగ్ బలానికి నిదర్శనం. అయితే ఈసారి బట్లర్, స్టోక్స్ లేకపోవడంతో కెప్టెన్ సంజు శాంసన్పై ఒత్తిడి పెరగనుంది. ఫిలిప్స్, లూయిస్తోపాటు లియామ్ లివింగ్ స్టోన్ టాపార్డర్లో కీలకం కానున్నారు. షంషీ రాకతో తమ బౌలింగ్ కూడా మెరుగుపడుతుందని రాయల్స్ నమ్మకంగా ఉంది. రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, చేతన్ సకారియాపై భారీ అంచనాలున్నాయి.
గేల్ ఫామ్లోకి వస్తేనే..
టీ20 స్పెషలిస్ట్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ టీమ్లో ఉన్నా.. పంజాబ్ కింగ్స్ రాత మాత్రం మారడం లేదు. ఎనిమిది మ్యాచ్లు ఆడి మూడు విజయాలతో ఆరు పాయింట్లతో ఆరో ప్లేస్లో ఉన్న పంజాబ్ బాగా కష్టపడితేనే ప్లే ఆఫ్స్పై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే ఇది సాధ్యం కావాలంటే యూనివర్స్ బాస్ గేల్ ఫామ్లోకి రావాలి. ఇటీవల గేల్ ఆడిన 10 మ్యాచ్ల్లో ఏ ఒక్కదాంట్లో తన మార్క్ ఆటను చూపెట్టలేకపోయాడు. భారీ రన్స్ కూడా చేయలేకపోయాడు. ఇక మిడిలార్డర్లో పూరన్ డకౌట్లకు ఫుల్స్టాప్ పెట్టాలి. దీపక్ హుడా, షారూక్ ఖాన్ మెరిస్తే భారీ స్కోరు ఖాయం. ఆసీస్ పేస్ ద్వయం జే రిచర్డ్సన్, మెరిడిత్ లేకపోవడం లోటే అయినా.. షమీ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం పంజాబ్ మిగిలిన ఆరు మ్యాచ్ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలిస్తే ఇతర జట్లతో ప్లేఆఫ్స్కు పోటీపడొచ్చు. మరి ఇది సాధ్యమవుతుందో లేదో చూడాలి.
సన్రైజర్స్కు నిరాశే!
ఎన్నో ఆశలు.. అంచనాలతో సీజన్లో అడుగుపెట్టిన సన్రైజర్స్ నిరాశ తప్పలేదు. సీజన్లో వరుస ఓటముల నేపథ్యంలో వార్నర్ను కెప్టెన్గా తప్పించి ఆ బాధ్యతలను విలియమ్సన్కు కట్టబెట్టినా జట్టు రాత మారలేదు. తొలి ఏడు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆ జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ చేరడం కోసం ఏడు మ్యాచ్ల్లో ఆరు నెగ్గడమంటే ఆషామాషీ కాదు. బెయిర్ స్టో (248) రెండో దశ మ్యాచ్లకు దూరం కావడం గట్టి ఎదురు దెబ్బే.