
అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్కు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గత రాత్రి తీవ్ర కడుపునొప్పికి గురైన రాహుల్కు సర్జరీ అనివార్యమైన నేపథ్యంలో ఆసుపత్రిలో చేర్పించారు. దాంతో తాత్కలిక సారథిగా మయాంక్ అగర్వాల్ పంజాబ్ జట్టును నడిపించనున్నాడు. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ మాట్లాడుతూ వికెట్ బాగుందని, బౌలింగ్కు అనుకూలంగా ఉందన్నాడు. ప్రతీ మ్యాచ్కు తామెంతో మెరుగవతున్నామని, కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నానని, సీనియర్లు సాయం చేస్తున్నారని తెలిపాడు. ఈ మ్యాచ్కు ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతున్నామన్నాడు.
ఇక మయాంక్ మాట్లాడుతూ.. తమ సారథిని మిస్సవుతున్నామన్నాడు. ఈ వికెట్ చాలా నెమ్మదిగా ఉందని, మంచి టార్గెట్ సెట్ చేస్తే ఫలితం సాధించవచ్చని తెలిపాడు. పూరన్ స్థానంలో డేవిడ్ మలన్ జట్టులోకి వచ్చాడన్నాడు. ఇక డేవిడ్ మలాన్కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్లాడిన ఢిల్లీ ఐదు విజయాలు సాధించగా.. అన్నే మ్యాచులు ఆడిన పంజాబ్ కేవలం మూడింట్లో మాత్రమే గెలుపొందింది. దాంతో విజయం లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 27 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో పంజాబ్ 15 మ్యాచ్ల్లో గెలుపొందగా.. ఢిల్లీ 12 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
తుది జట్లు:
పంజాబ్: మయాంక్ అగర్వాల్, ప్రభ్సిమ్రాన్ సింగ్, క్రిస్ గేల్, దీపక్ హుడా, డేవిడ్ మలన్, హర్ప్రీత్ బ్రార్, షారూక్ ఖాన్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, క్రిస్ జోర్దాన్.
ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, షిమ్రాన్ హిట్మెయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, కగిసో రబాడ, అవేష్ ఖాన్, ఇషాంత్ శర్మ, లలిత్ యాదవ్