
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) విడుదల చేసిన తాజా జెర్సీకి ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా ఫిదా అయ్యాడు. కొత్త జెర్సీ వేసుకునేందుకు ఆత్రుతగా ఉందన్నాడు. ఈ విషయాన్నే ట్విటర్ వేదికగా పంచుకున్న రైనా.. సీఎస్కే మేనేజ్మెంట్, కెప్టెన్ ధోనీని ప్రశంసించాడు.
'మన దేశానికి ఎంతో సేవ చేస్తున్న ఆర్మీ జవాన్ల గౌరవార్థం జెర్సీలో మార్పులు చేసినందుకు చెన్నై సూపర్కింగ్స్, ధోనీకి అభినందనలు. దానిని ధరించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను" అని రైనా ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ట్రైనింగ్ క్యాంప్ కోసం ముంబైకి చేరుకున్న రైనా.. క్వారంటైన్లో ఉన్నాడు. త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం సీఎస్కే రూపొందించిన కొత్త జెర్సీలో ఆటగాళ్ల భుజాలపై ఈ 'క్యామోఫ్లాజ్' కనిపిస్తుంది. ఈ జెర్సీని బుధవారం ధోనీ స్వయంగా ఆవిష్కరించాడు. భారత సైనికులకు సంఘీభావంగా ఈ ప్రింట్ను ముద్రించినట్లు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
సాయుధ దళాలకు సంబంధించి నిస్వార్థ పాత్ర గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నించాలనుకున్నాం. చివరికి ఈ విధంగా సాధ్యమైంది. వారు నిజమైన హీరోలు" అని జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ వెల్లడించాడు. 2010, 2011, 2018లలో మూడు సార్లు ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
ఇందుకు గుర్తుగా సీఎస్కే మూడు స్టార్లను జెర్సీపై ఉంచింది. ప్రస్తుతం చెన్నై వేదికగా ట్రైనింగ్ చేస్తున్న సీఎస్కే ఈ శుక్రవారం ముంబై చేరుకుంటుంది. క్వారంటైన్ అనంతరం రైనా టీమ్తో కలవనున్నాడు. ఏప్రిల్ 10న ముంబై వేదికగా జరిగే మ్యాచ్లో సీఎస్కే.. ఢిల్లీతో తొలి మ్యాచ్ ఆడనుంది.