
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ మలిదశ మ్యాచ్ల కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అందరికన్నా ముందుగానే దుబాయ్కి పయనమయ్యాయి. కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన ఈ లీగ్ సెకాండాఫ్ మ్యాచ్లు యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ ధనాధన్ మలిదశ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే, ముంబై ఇండియన్స్ తమ సన్నాహకాలను అప్పుడే మొదలుపెట్టాయి.
కరోనా క్వారంటైన్ నేపథ్యంలో ముందుగానే ఆటగాళ్లను దుబాయ్కి తరలించి ప్రాక్టీస్ క్యాంప్లు నిర్వహించాలని భావించాయి. ఓవైపు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే.. మరోవైపు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ఇరు జట్లు శుక్రవారం దుబాయ్ ఫ్లైట్ ఎక్కాయి. దుబాయ్కి బయల్దేరామని ముంబై ఇండియన్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. తమ టాలెంట్ స్కౌట్ వినయ్కుమార్ ఫోటోను షేర్ చేసింది. అబుదాబి వేదికగా ముంబై ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించనుంది.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కూడా చెన్నై నుంచే దుబాయ్ బయల్దేరింది. ఈ విషయాన్ని సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ సోషల్మీడియాలో వెల్లడించింది. దుబాయ్ కేంద్రంగా చెన్నై తమ సన్నాహకాలను ప్రారంభించనుంది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ముందుగానే ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహిస్తే జట్టుకు కలిసొస్తదని ఆ టీమ్ భావిస్తోంది. ఈ వారం ఆరంభంలోనే చెన్నైలో అడుగుపెట్టిన ధోనీ.. తన కార్యచరణను మొదలుపెట్టాడు. అతనితో పాటు సురేశ్ రైనా, కర్ణ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్, అంబటి రాయుడు దుబాయ్కి బయల్దేరారు.
ధోనీతో సహా ఆటగాళ్లంతా పీపీఈ కిట్లతో పాటు మాస్క్లు ధరించారు. గతేడాది ఆ జట్టు నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంది. దుబాయ్ వెళ్లగానే పలువురు యువ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దాంతో వారు ఎక్కువ సమయం క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఇది జట్టు ఆటపై ప్రభావం చూపింది. ఆ అనుభవం నేపథ్యంలోనే ఆటగాళ్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే లీగ్ సెకండాఫ్ ఫస్ట్ మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. అక్టోబర్ 15న ఫైనల్ జరగనుంది.
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో సీఎస్కే దారుణంగా విఫలమైంది. లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేదు. కానీ భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్టాఫ్లో ధోనీ మార్క్ కెప్టెన్సీతో 7 మ్యాచ్ల్లో 5 విజయాలందుకొని ఢిల్లీ క్యాపిటల్స్ తరువాత రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ 7 మ్యాచ్ల్లో 6 విజయాలతో టాప్లో ఉంది.