
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్ని విధాల సిద్దమవుతున్నాడు. గత సీజన్లో దారుణంగా విఫలమైన మహీ.. ఈ సీజన్లో అదరగొట్టాలనే సంకల్పంతో సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్ షురూ చేసిన చెన్నై.. టైటిలే లక్ష్యంగా సిద్దమవుతోంది.
ఈ ట్రైనింగ్ క్యాంప్లో ధోనీ వరుస సిక్సర్లతో చెలరేగాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో నెట్ బౌలర్లందరినీ ఉతికారేశాడు. దాదాపు గంట సేపు ప్రాక్టీస్ కొనసాగించిన ధోనీ ప్రాక్టీస్ ఆరంభంలో డిఫెన్స్కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్లోకి పంపించాడు. ధోనీ ఆడిన షాట్లలో తన ఫేవరెట్ అయిన హెలికాప్టర్ షాట్ను ఎక్కువసార్లు ఆడాడు. ధోనీ ఒక్కో షాట్ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్లో చెన్నై ఘోర పరాభావంతో లీగ్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.
ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో విజయాలు అందుకున్న అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ భారత్లో జరగడం సానుకూలాంశం. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో మ్యాచ్లు జరుగనున్నాయి. గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోనీ.. ఈ ఏడాది చెన్నైకి టైటిల్ అందించి ఐపీఎల్కు అల్విదా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నాడు.