
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) సన్నాహకాలు షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు చెన్నైలో అడుగుపెట్టారు. లీగ్కు ప్రారంభానికి ముందు సీఎస్కే ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించనుంది.మార్చి సెకండ్ వీక్లో సీఎస్కే ప్రాక్టీస్ క్యాంపు మొదలవుతుందని జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు.
"వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం మార్చి 8 లేదా 9న ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించాలనుకుంటున్నాం. ఇప్పటికే కెప్టెన్ ధోనీ చెన్నై చేరుకున్నాడు. అంబటి రాయుడితో పాటు అందుబాటులో ఉన్న క్రీడాకారులు క్యాంపులో పాల్గొంటారు. తమిళనాడు క్రికెటర్లు వారికి తోడవుతారు.'అని ఆయన పేర్కొన్నారు. ఇక సురేశ్ రైనా కూడా ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొననున్నాడు. ఇప్పటికే మూడు సార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై.. గతేడాది ఘోర ప్రదర్శనతో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. లీగ్ చరిత్రలోనే తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించింది.
ఈ సీజన్లో టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న సీఎస్కే ఆటగాళ్లను కూడా మార్చేసింది. షేన్ వాట్సన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. జట్టుకు అక్కర్లేదని భావించిన హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, పియూష్ చావ్లాను వదులుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో మొయిన్ అలీ, కృష్ణప్ప గౌతమ్లను కొనుగోలు చేసింది.
చెన్నై రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, సురేశ్ రైనా, సామ్ కర్రన్, జోష్ హజెల్వుడ్, ఇమ్రాన్ తాహిర్, ఫాఫ్ డుప్లెసిస్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, అంబటి రాయుడు, మిచెన్ శాంట్నర్, రవీంద్ర జడేజా, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, లుంగీ ఎంగిడి, సాయి కిశోర్.