MI vs RCB: 'వాట్ ఏ బాల్' కైల్ జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగిందిగా!! (వీడియో)

చెన్నై: గత ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మినీ వేలంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమిసన్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే. ఈ కివీస్ పేసర్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. అంత భారీ ధర అతనికి అవసరమా? అని అనుకున్నారు. అయితే ఐపీఎల్ 2021 ఆరంభం మ్యాచులోనే జేమిసన్ సత్తాచాచాడు. తన కోటా 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అంతేకాదు తన పేస్తో ఓ బ్యాటును కూడా విరగొట్టాడు.
దెబ్బకు బ్యాట్ విరిగింది:
చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ను కైల్ జేమిసన్ వేయగా.. కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. ఆ ఓవర్ మూడో బంతిని జేమిసన్ యార్కర్ వేశాడు. దానిని ఎదుర్కోవడంలో కృనాల్ విఫలం కాగా.. బంతి బ్యాట్ను బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్కున్న హ్యాండిల్ హుక్ ఊడి బయటకొచ్చింది. దీనిని చూసి కృనాల్ మొదట షాక్ అయినా.. ఆ తర్వాత రెండు ముక్కలైన తన బ్యాట్ను చూసి నవ్వుకున్నాడు.

వాట్ ఏ బాల్ జేమిసన్:
కైల్ జేమిసన్ వేసిన బుల్లెట్ బంతికి బ్యాట్ విరిగిపోవడం చూసిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆపై కొత్త బ్యాట్ తెచ్చుకుని బ్యాటింగ్ చేసిన కృనాల్ పాండ్యా.. చివరి ఓవర్ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. 7 బంతుల్లో 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. బ్యాట్ విరిగిపోయిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'వారెవ్వా జేమిసన్.. దెబ్బకు బ్యాట్ విరిగింది', 'వాట్ ఏ బాల్ జేమిసన్', 'బుల్లెట్ లాంటి బంతికి కృనాల్ వద్ద సమాధానం లేకుండా పోయింది' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

జేమిసన్ ఒక్కడే:
కివీస్ క్రికెటర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇప్పటి వరకు కైల్ జేమిసన్ ఒక్కడే. బౌల్ట్, విలియంసన్ కూడా ఇంత భారీ ధర లేదు. ఇక ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడు అతనే. అమెరికా డాలర్లలో రూ.15 కోట్ల విలువ 20 లక్షల డాలర్లకు సమానం కావడం గమనార్హం. న్యూజిలాండ్ కరెన్సీలో రూ.15 కోట్లంటే ఎంతో తనకు తెలియదని వేలం అనంతరం జేమీసన్ అప్పుడు అన్నాడు. కివీస్ తరఫున జేమిసన్ 6 టెస్టులు, 5 వన్డేలు, 8 టీ20లు ఆడాడు.

రెచ్చిపోయిన లిన్:
ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 159/9 స్కోర్ సాధించింది. క్రిస్ లిన్ (49; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్ యాదవ్ (31; 23 బంతుల్లో 4x4, 1x6) రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్కు కీలకమైన 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ (19; 15 బంతుల్లో 1x4, 1x6) అనవసర పరుగుకు యత్నించి ఆదిలోనే రనౌటయ్యాడు. హర్షల్ చివరి ఓవర్లోనే 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. సుందర్, జెమీసన్ చెరో వికెట్ తీశారు.
MI vs RCB: ఐదు వికెట్లతో చెలరేగిన హర్షల్ పటేల్.. మోస్తరు స్కోరుకే పరిమితమైన ముంబై!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications