
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ తొలి మ్యాచ్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ తడబడింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసి.. బెంగళూరుకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. హర్షల్ చివరి ఓవర్లోనే 3 వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరు తరఫున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ హర్షల్ కావడం విశేషం. ముంబై ఓపెనర్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 49) మాత్రమే రాణించాడు. యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 28), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 31) పర్వాలేదనిపించారు.
చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా బెంగళూరుతో జరుగుతున్న లీగ్ తొలి మ్యాచ్లో.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఆరంభంలోనే తడబడింది. స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, క్రిస్ లిన్ క్రీజులో ఉన్నా.. మొహ్మద్ సిరాజ్, కైల్ జెమీసన్ బౌలింగ్లో పరుగులు చేయలేకపోయారు. అయితే క్రీజులో కుదురుకుంటున్న సమయంలో రోహిత్ రనౌట్ అయ్యాడు. అనవసర పరుగుకు యత్నించి ఆదిలోనే పెవిలియన్ చేరాడు. తర్వాత లిన్, సూర్యకుమార్ స్వేచ్ఛగా ఆడుతూ రెండో వికెట్కు అర్ధ శతక భాగస్వామ్యం జోడించారు. బెంగళూరు బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దాంతో తొమ్మిది ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 83/1తో పటిష్ఠస్థితికి చేరింది.
అయితే ప్రమాదకరంగా మారుతున్న లిన్, సూర్యకుమార్ జోడీని జేమీసన్ విడదీశాడు. పదో ఓవర్ చివరి బంతికి సూర్యను బోల్తా కొట్టించాడు. అతడు కీపర్ డివిలియర్స్కు చిక్కడంతో ముంబై 94 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే లిన్ అర్ధ శతకానికి ఒక్క పరుగు ముందు సుందర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (13), ఇషాన్ కిషన్ (28) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.
ఇక ఇన్నింగ్స్ చివర్లో కీరన్ పొలార్డ్ (7), కృనాల్ పాండ్యా (7) కూడా నిరాశపరిచారు. 19వ ఓవర్లో జేమీసన్ వేసిన ఓ బంతికి కృనాల్ బ్యాట్ విరగడం విశేషం. ఇక ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీసి కేవలం ఒకే పరుగు ఇచ్చాడు. దాంతో ముంబై ఇన్నింగ్స్కు తెరపడింది. ఓ దశలో హ్యాట్రిక్ తీసేలా కనిపించినా.. తృటిలో మిస్ అయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ ఐదు.. సుందర్, జెమీసన్ చెరో వికెట్ తీశారు.