అహ్మదాబాద్: సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021 సీజన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నైట్రైడర్స్ టీమ్లో చాలా మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా ఆటగాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఉలిక్కపడ్డ ఫ్రాంఛైజీ సదరు ప్లేయర్స్ను ఐసోలేషన్కు తరలించింది. స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్తో సహా మరికొంతమంది ఆటగాళ్లు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో నేడు ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని క్రిక్బజ్ పేర్కొంది. అయితే బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కేకేఆర్ క్యాంప్లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని బీసీసీఐ అధికారి తమకు తెలిపారని ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐ కూడా ప్రకటించింది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు సందీప్ వారియర్లు కరోనా బారిన పడ్డారని, దాంతో కేకేఆర్తో మ్యాచ్ ఆడేందుకు ఆర్సీబీ సుముఖంగా లేదని సదరు అధికారి తెలిపారు. 'వరుణ్, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. దాంతో ఆర్సీబీ క్యాంప్ ఆందోళనకు గురైంది. మ్యాచ్ ఆడటానికి ఇష్ట పడకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.' అని ఆ అధికారి చెప్పుకొచ్చారు.
అత్యంత సురక్షితమైన బయో బబుల్లో ఈ లీగ్ జరుగుతుండగా.. కేకేఆర్ ఆటగాళ్లు అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో లీగ్ సజావుగా నిర్వహించి టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ భావించింది. కానీ తాజా సంఘటన లీగ్ రద్దుకు దారితీసేలా ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లా అర్థాంతరంగా వాయిదా పడుతుందా? అనే ఆందోళన నెలకొంది.