
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 హంగామా మొదలైంది. శుక్రవారం చెన్నై వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్కు తెరలేవనుంది. ఏప్రిల్ 11న సన్రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఈ సన్నాహకాల్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ టీమ్ రెండుగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఒక జట్టుకు నితీష్ రాణా సారథ్యం వహించగా.. మరో టీమ్కు బెన్ కట్టింగ్ కెప్టెన్గా ఉన్నాడు. నితీష్ రాణా టీమ్ పేరు గోల్డ్ కాగా.. బెన్ కట్టింగ్ జట్టు పేర్ పర్పుల్. అయితే ఈ మ్యాచ్లో పర్పుల్ టీమ్ను గోల్డ్ చిత్తుగా ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన నితీష్ రాణా నేతృత్వంలోని గోల్డ్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల195 పరుగులు చేసింది. కరుణ్ నాయర్(30 బంతుల్లో 41), షకీబ్ (9 బంతుల్లో 17), దినేశ్ కార్తీక్(19 బంతుల్లో 42) రాణించారు. విధ్వంసకర వీరుడు ఆండ్రూ రస్సెల్(5 బంతుల్లో 4) ఫస్ట్ టైమ్ విఫలమవగా.. అతనికి మరో చాన్స్ ఇచ్చారు. సెకండ్ టైమ్ బ్యాటింగ్ చేసిన రస్సెల్(6 బంతుల్లో 22) మెరుపులు మెరిపించాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన బెన్ కట్టింగ్ సారథ్యంలో పర్పుల్ టీమ్ 113 పరుగులకు ఆలౌటై చిత్తుగా ఓడింది. రాహుల్ త్రిపాఠి(26 బంతుల్లో 32) మినహా అంతా విఫలమయ్యారు.
అయితే ఈ మ్యాచ్ స్కోర్ కార్డ్పై క్లారిటీ లేదు. ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కేకేఆర్.. స్కోర్ కార్డ్ మాత్రం పంచుకోలేదు. దాంతో ఈ పరుగుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. తొలుత ఏ జట్టు బ్యాటింగ్ చేసిందనేదానిపై కూడా క్లారిటీ లేదు. గత సీజన్లో ఐదో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. గతేడాది తమ ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్తోనే ఈ సీజన్ను షూరు చేస్తుంది.