
సరైన నిర్ణయమే..
'భారత్లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఆ పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపించింది. బయో బబుల్లో ఉంటూ ఆడటం చాలా బాగా అనిపించింది. టోర్నీ నిలిచిపోయేవరకు బబుల్లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కానీ అక్కడక్కడ ప్రోటోకాల్స్ బ్రేక్ అయ్యాయి. దాంతో టోర్నీ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల వాయిదా వేయ్యడమే మంచి నిర్ణయం. టోర్నీ ఆగిపోయాక మమ్మల్ని మాల్దీవ్స్ పంపడం, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకెళ్లడం సవాలే అయినప్పటికీ బీసీసీఐ, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పట్లు చేశాయి. మమ్మల్ని ఈజీగా గమ్యం చేర్చాయి.'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

భారత్తో పోరు సవాలే..
టీమిండియాతో పోరు ఎప్పుడూ సవాలేనని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానన్నాడు. 'ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు ఆత్రుతగా ఉంది. ఇందులో గెలిస్తే మరింత బాగుంటుంది. తొలిసారి టైటిల్ కాబట్టి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. టీమిండియాతో ఎప్పుడు తలపడ్డా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. వారితో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ జట్టులో నాణ్యమైన ప్లేయర్స్ ఉంటారు. ఫైనల్ గెలిచేందుకే ప్రయత్నిస్తాం' అని కేన్ విలియమ్సన్ ధీమా వ్యక్తం చేశాడు.

మాల్దీవులకు జంప్..
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన న్యూజిలాండ్ ప్లేయర్లు ఢిల్లీలో ఉండి ప్రత్యేక విమానంలో యూకే వెళ్లాల్సి ఉంది. కరోనా ఉధృతి నేపథ్యంలో తమ ప్లేయర్ల భద్రతా దృష్ట్యా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(ఎన్జెడ్సీ) ఢిల్లీలో వీరి కోసం మినీ బయో బబుల్ ఏర్పాట్లు చేయించింది. కానీ ఢిల్లీలో రెండు రోజులు గడిపాక కరోనా తీవ్రత దృష్ట్యా ఇక్కడ ఉండటం సురక్షితం కాదని భావించిన ఈ నలుగురూ మాల్దీవుల విమానం ఎక్కేసారు. కొన్ని రోజులు మాల్దీవుల్లో గడిపాక అక్కడి నుంచి వీరంతా లండన్కు చేరుకోనున్నారు. కాగా, కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన ఫ్యామిలీని చూసేందుకు స్వదేశం వెళ్లిపోయాడు. ఐపీఎల్లో ఆడిన మిగతా ప్లేయర్ల కోసం ఏర్పాట్లు చేసిన చార్టెడ్ ఫ్లైట్ ఎక్కాడు.


Click it and Unblock the Notifications












