
చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున 100 మ్యాచ్లు ఆడతానని అస్సలు ఊహించలేదని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తెలిపాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్ చాహల్కు ఆర్సీబీ తరఫున 100వ ఐపీఎల్ మ్యాచ్. 2013లో ముంబై ఇండియన్స్తో ఈ క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన యూజీ.. ఆ మరుసటి ఏడాదే ఆర్సీబీలో చేరాడు. తనదైన బౌలింగ్తో సత్తా చాటి అక్కడి నుంచి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇక 100వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఆర్సీబీ మీడియా టీమ్తో మాట్లాడిన చాహల్.. ఈ ఫీట్ సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇది ఎమోషనల్ జర్నీ అని పేర్కొన్నాడు.
'2014లో ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీ జట్టులోకి వచ్చాను. ఆ టైమ్లో నేను ఆర్సీబీ తరఫున 100 మ్యాచ్లను ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా ఓ ఎమోషనల్ జర్నీ. ఆర్సీబీ తరఫున ఇది నాకు 100వ మ్యాచ్. నా సాయశక్తుల రాణించడానికి ప్రయత్నిస్తా. ఇది నాకు చాలా భావోద్వేగంతో కూడిన విషయం. ఓ ఫ్రాంచైజీకి 100 మ్యాచ్లు ఆడుతానని అస్సలు అనుకోలేదు'అని చాహల్ చెప్పుకొచ్చాడు. 2013లో ముంబై తరఫున ఏకైక మ్యాచ్ ఆడిన చాహల్.. ఆర్సీబీ తరఫున ఇప్పటి వరకు 99 మ్యాచ్లాడి 7.69 ఎకానమీతో 121 వికెట్లు తీశాడు.
ఇక ఆర్సీబీ తరఫున 100వ మ్యాచ్ ఆడుతున్న చాహల్కు కోహ్లీ బెస్ట్ విషెస్ తెలియజేశాడు. 'చాహల్కు ఇది గర్వకారణమైన విషయం. ఆర్సీబీ తరఫున 100వ మ్యాచ్ ఆడుతున్న అతనికి నా బెస్ట్ విషెస్. కొన్నేళ్లుగా ఆర్సీబీ తరఫున అతను అదరగొడుతున్నాడు. ఎన్నో మ్యాచ్ల్లో తనదైన బౌలింగ్తో మలుపు తిప్పాడు. చాలా సరదాగా ఉండే వ్యక్తి. 'అని కోహ్లీ ప్రశంసించాడు.