చూసేసానన్న నాని..
ఐపీఎల్ వేలానికి ఎంపికయ్యావని చెప్పగానే సహచర ఆటగాళ్లంతా అభినందించారని, కానీ తనకు మాత్రం జెర్సీ సీన్ గుర్తొచ్చిందన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం సన్నద్ధమవుతున్న అతను.. తాజాగా చెన్నై మీడియం టీమ్తో సంభాషించాడు. ఈ సందర్భంగా తెలుగులోనే మాట్లాడుతూ.. జెర్సీ సినిమాను గుర్తుకు తెచ్చుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను సీఎస్కే షేర్ చేసింది. అంతేకాకుండా ఈ వీడియో నాని చూడాలని కోరింది. దీనికి నాని చూసేశా అని బదులిస్తూ.. లవ్ ఏమోజీతో రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

అమ్మా అని అరిచా..
ఈ వీడియోలో హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. 'జెర్సీ సినిమాతో నేను ఎంతగానో కనెక్ట్ అయ్యాను.. క్రికెటర్ల భావోద్వేగాలను ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ట్రైన్ సీన్ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. సాధారణ ప్రజలకు ఆ సీన్ ఓవరాక్షన్లా ఉండొచ్చు. కానీ క్రికెటర్లకు ఆ బాధ ఏంటో తెలుసు. నేను ఐపీఎల్ వేలానికి ఎంపికైనప్పుడు సహచర ఆటగాళ్లంతా అభినందించారు. కానీ నేను రూమ్లో వెళ్లి 'అమ్మా'అని గట్టిగా అరిచా. ఇది కలా? నిజమా? అని తెలియలేదు. ఆ క్షణం నాకు జెర్సీ సినిమాలోని సీన్ గుర్తొచ్చింది.'అని చెప్పుకొచ్చాడు.
ధోనీ వికెట్ తీసి..
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన హరిశంకర్ రెడ్డి ఆంధ్ర టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్ దృష్టిని ఆకర్షించాడు. ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో సీఎస్కే అతన్ని రూ. 20 లక్షల కనీధరకు కొనుగోలు చేసింది. ఇటీవల జట్టు ప్రాక్టీసులో భాగంగా అతడు ఏకంగా కెప్టెన్ ధోనీనే బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ ఏడాది అతనికి తుదిజట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి? ప్రస్తుత సీజన్లో చెన్నై సూపర్కింగ్స్.. తన తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఇక సీఎస్కే.. ఐపీఎల్ 2021 క్యాంపైన్లో భాగంగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఆ ఫ్రాంచైజీ మీడియా టీమ్ హరిశంకర్ రెడ్డిని తెలుగులో మాట్లాడించింది.

రైతు బిడ్డ..
హరిశంకర్ రెడ్డి పక్కా రైతు బిడ్డ. అతని తల్లిదండ్రులకు వ్యవసాయం తప్ప వేరే పనే తెలియదు. వారికి ఇద్దరు సంతానం కాగా, పెద్ద కుమారుడు ఉపాధి నిమిత్తం కువైట్లో స్థిరపడ్డాడు. హరిశంకర్ రెడ్డి డిగ్రీ వరకు సరదాగా చదువుకున్నాడు. కానీ, స్నేహితులతో కలిసి ఎప్పుడూ క్రికెట్ మైదానాల చుట్టూ తిరిగేవాడు. ఎలాంటి పని లేకుండా, క్రికెట్ ధ్యాసతోనే పెరిగిన తమ కుమారుడు ఈ స్థాయికి ఎదుగుతాడనుకోలేదని వారి తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవి ఐపీఎల్ 2021 వేలంలో ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
తమ కుమారుడు ఎప్పుడూ క్రికెట్ బ్యాటు, బాలు పట్టుకుని తిరిగే వాడని, ఎమైపోతాడోనని అనుకున్నామని లక్ష్మీదేవి చెప్పారు. బడికి పొమ్మన్నా, లేదా పొలం పనికి రావాలన్నా వినకుండా ఎప్పుడూ క్రికెట్ అంటూ ఊళ్లు పట్టుకుని తిరిగేవాడని వివరించారు. ఇలా తిరుగుతున్న తమ కుమారుడిని, తల్లిదండ్రులుగా తమను గ్రామస్తులు కూడా సూటిపోటి మాటలు అనేవారన్నారు. కానీ, ఈరోజు తన కుమారుడు సాధించిన ఘనత గురించి అందరూ చెప్పుకుంటుంటే సంతోషంగా, గర్వంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications












