
సరైన వ్యూహం..
ఇది ధోనీ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడని ఈ బీజేపి ఎంపీ కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ.. అతను కేవలం ఒక సీజన్ గురించే మాత్రమే ఆలోచిస్తాడని చెప్పాడు.'చెన్నై సరైన నిర్ణయం తీసుకుంది. జట్టును పునరుద్ధరించడమంటే జట్టు మొత్తాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అంతేగాక గత సీజన్లో సీఎస్కే ప్రదర్శన మరీ అంత పేలవంగా లేదు. ఆ జట్టుపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ప్రతిసారీ ప్లేఆఫ్కు చేరేవాళ్లు. అందుకే చెన్నై జట్టు పటిష్టంగా లేదని, ఆటగాళ్లందరినీ మార్చాలని అందరూ భావించారు. కానీ ఆ జట్టు కేవలం అయిదుగురు ఆటగాళ్లను మాత్రమే వదలుకుంది'' అని గంభీర్ తెలిపాడు.

ధోనీ స్పెషల్ ఇది..
'ధోనీ ప్రత్యేకత ఇదే. అతను దేని గురించి మరీ లోతుగా ఆలోచించడు. ప్రస్తుత సీజన్ వరకు మాత్రమే ఆలోచిస్తాడు. పియూష్ చావ్లాకు అధిక ధర వెచ్చించాల్సి వస్తుందన్న కారణంతోనే విడిచిపెట్టింది. కరణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్ను అంటిపెట్టుకుంది. కేదార్ జాదవ్ కూడా అంతే. అతడి పారితోషకం వల్లే రిటైన్డ్ చేసుకోలేదు. కేదార్ ధర రూ.3-4 కోట్లు అయితే.. అతడిని ధోనీ మరో సీజన్ వరకు కొనసాగించేవాడు'అని పేర్కొన్నాడు.

ఆర్సీబీలోనిది ఇదే..
'మరోవైపు బెంగళూరు పది మంది ఆటగాళ్లను వదులుకుంది. గత సీజన్లో వాళ్లు ప్లేఆఫ్స్కు కూడా చేరారు. ఐపీఎల్లో సీఎస్కే విజయంతమవుతుండటానికి కారణం వాళ్ల ఆలోచనలే. జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్ రూమ్లో ఉండే అందరి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. సీఎస్కే, ఆర్సీబీ జట్టుకు తేడా ఇదే'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. చెన్నై జట్టు కేదార్ జాదవ్, షేన్ వాట్సన్ (రిటైర్డ్), పియూష్ చావ్లా, మురళీ విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్ను వదిలేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అత్యధికంగా 10 మందిని వదలుకుంది. క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ, ఉదాన, శివమ్ దూబె, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి, గుర్కీరత్లకు ఉద్వాసన పలికింది.


Click it and Unblock the Notifications
