
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్ దుమ్మురేపారు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన కోల్కతానైట్రైడర్స్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 86) హాఫ్ సెంచరీతో రాణించగా.. మొయిన్ అలీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(27 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32), రాబిన్ ఊతప్ప(15 బంతుల్లో 3 సిక్స్లతో 31) కీలక పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీయగా.. శివం మావి ఓ వికెట్ తీశాడు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(32), ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభం అందించారు. షకీబ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే బౌండరీ బాదిన రుతురాజ్.. అతని మరుసటి ఓవర్లో 4, 6 బాదాడు. మరోవైపు డుప్లెసిస్ సైతం ఫోర్లు బాదడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. దాంతో సీఎస్కే పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఆ తర్వాత నరైన్, వరుణ్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో రుతురాజ్ ఒత్తిడికి గురయ్యాడు. నరైన్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నంచి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప క్రీజులోకిరాగా.. షకీబ్ వేసిన 10వ ఓవర్లో డుప్లెసిస్ రెండు భారీ సిక్సర్లు బాది 15 పరుగులు పిండుకున్నాడు.
ఫెర్గూసన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో మరో రెండు ఫోర్లు, సిక్స్ బాదిన డుప్లెసిస్.. 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ బౌలింగ్లో ఊతప్ప ఇచ్చిన క్యాచ్ను చేజార్చగా.. ఈ అవకాశాన్ని అందుకున్న అతన్ని వరుణ్ బౌలింగ్లో భారీ సిక్స్ బాది టచ్లోకి వచ్చాడు. నరైన్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదిన అతను ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి మొయిన్ అలీ రాగా.. అతను కూడా ధాటిగా ఆడాడు. ఓవైపు అలీ.. మరోవైపు డూప్లెసిస్ బౌండరీలతో చెలరేగడంతో చెన్నై 18 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తీ వేసిన 19వ ఓవర్లో 13 రన్స్ రాగా.. శివం మావి వేసిన ఆఖరి ఓవర్లో ఏడు రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీయడంతో చెన్నై 192 పరుగులకే పరిమితమైంది.