
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆ జట్టు స్టార్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కోలుకున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. 24 గంటల అనంతరం నిర్వహించే మరో పరీక్షల్లో కూడా నెగటీవ్ వస్తే పడిక్కల్ టీమ్ బయోబబుల్లో చేరనున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆర్సీబీ టీమ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆర్సీబీ టీమ్ సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాలు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి.
'ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. దేవదత్ పడిక్కల్కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. అతనికి 24 గంటల్లో మరిన్ని పరీక్షలు చేయనున్నారు. అందులో కూడా నెగటీవ్ వస్తే 7 రోజుల క్వారంటైన్ అవసరం లేకుండా జట్టు బయో బబుల్లో చేరుతాడు'అని ఓ ట్విటర్ యూజర్ పేర్కొన్నాడు.
గత నెల 22న కరోనా బారిన పడిన ఈ యువ ఓపెనర్ ప్రస్తుతం బెంగళూరులోని తన నివాసంలోనే క్వారంటైన్లో ఉంటున్నాడు. అతనికి ఎలాంటి లక్షణాలు లేవని ఆర్సీబీ టీమ్ పేర్కొంది. అయితే పడిక్కల్కు నెగటీవ్ వస్తే 7 రోజుల క్వారంటైన్ అవసరం లేకుండానే జట్టుతో కలుస్తాడని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన పడిక్కల్ సేవలు ఆర్సీబీకి చాలా అవసరం.
పైగా ఈ ఏడాది జరిగిన డొమెస్టిక్ టోర్నీలో పడిక్కల్ సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. దేశవాళి ప్రతిష్టాత్మ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్ల్లో 737 రన్స్ చేశాడు. ఇదే జోరును ఐపీఎల్లోను కొనసాగించాలని భావిస్తున్నాడు. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన పడిక్కల్.. 15 మ్యాచ్ల్లో 473 రన్స్ చేశాడు.