
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. లీగ్ నిబంధనల మేరకు చేసిన పరీక్షల్లో అతనికి పాజిటీవ్ తేలిందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్ నితీష్ రాణా కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా అక్షర్ పటేల్ కూడా ఆ జాబితాలో చేరడంతో ఆటగాళ్లలో ఆందోళన మొదలైంది.
ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న అక్షర్కు తాజా కరోనా పరీక్షల్లో పాజిటీవ్ అని తేలడంతో అతన్ని ఐసోలేషన్కు తరలించారు.'అక్షర్కు కరోనా వైరస్ సోకింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రొటోకాల్స్ ప్రకారం అక్షర్ ఐసోలేషన్కు వెళ్లనున్నాడు'అని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నెల 9వ తేదీ నుంచి ఆరంభం కానున్న తరుణంలో ఆటగాళ్లంతా క్వారంటైన్ నియమాలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, అక్షర్కు చేసిన కరోనా టెస్టులో ఆ వైరస్ సోకిందని తేలడంతో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నియమావళి ప్రకారం అక్షర్ పది రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్లో ఉండనున్నాడు. అతనికి కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతే జట్టుతో కలవనున్నాడు.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా సంప్రదాయక ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అక్షర్... మొత్తం 27వికెట్లతో సత్తాచాటాడు. మరొవైపు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా ఆడాడు. అనంతరం ఇంటికి వెళ్లిన అక్షర్.. ప్రస్తుతం ఢిల్లీ క్యాంప్లో క్వారంటైన్లో ఉన్నాడు. అయితే అక్షర్కు కరోనా సోకిన విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.