
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆసక్తికర సన్నివేశం చోటు చోసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యామిలీ గ్యాలరీకి వెళ్లిన ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ తన ప్రేయసీకి ప్రపోజ్ చేశాడు. మొకాలిపై కూర్చొని 'నేను నిన్న ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా?'అని అడిగాడు.
దీపక్ చాహర్ చేసిన పనితో ఒకింత ఆశ్చర్యానికి గురైన ఆ అమ్మాయి.. వాట్? అంటూ అతని ప్రేమను అంగీకరిస్తూ గట్టిగా హత్తుకుంది. అనంతరం అతని చేత తన వేలికి ఉంగరాన్ని పెట్టించుకుంది. చాహర్కు కూడా రింగ్ పెట్టింది. ఇదంతా ఓ సినిమా సన్నివేశాన్ని తలపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై ఫ్యామీలీ గ్యాలరీకి వచ్చిన దీపక్ చాహర్.. ఏం తెలియనట్టూ కొద్దిసేపు నిలబడ్డాడు. ఆ తర్వాత ధోనీ కూతురు జీవాను పక్కకు జరుపుతూ తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు.
దాంతో పక్కనున్న వారంత అవాక్కయ్యారు. హోహో అంటూ చప్పట్లతో అభినందించారు. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ జోడీని ఆశీర్వదించారు. ఇక కామెంటేటర్లు సైతం ఈ జోడి బాగుండాలని దీవించారు. దీపక్ చాహర్కు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. చెన్నై అభిమానులు చాహర్కు అభినందనలు తెలుపుతున్నారు. ఇక తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన మూమెంట్ అని ఈ వీడియోను చాహర్ ఇన్స్టా వేదికగా పంచుకున్నాడు. అయితే ఆ అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఓ వికెట్ తీసినప్పటికీ దీపక్ చాహర్ (1/48) కూడా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో ఒంటిచేత్తో విజయాన్నందించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 76) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, షమీ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్.. కేఎల్ రాహుల్ విధ్వంసానికి 13 ఓవరల్లో 4 వికెట్లకు 134 పరుగులు చేసి 42 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీసాడు.