శుభారంభం లేదు..
172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు శుభారంభం దక్కలేదు. కైల్ జేమీసన్ వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(6) క్యాచ్ఔట్గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి ఓవర్లో ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్(4)ను మహ్మద్ సిరాజ్ కీపర్ క్యాచ్గా వెనక్కిపంపాడు. ఈ క్రమంలో కెప్టెన్ రిషభ్పంత్.. మరో ఓపెనర్ పృథ్వీషాతో నిదానంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇక షా కొన్ని బౌండరీలు రాబట్టడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 43 రన్స్ చేసింది. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ట్రంప్ కార్డ్ హర్షల్ పటేల్ను రంగంలో దింపి ఫలితాన్ని రాబట్టాడు. అతను వేసిన 8 ఓవర్లో పృథ్వీ షా(21) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.
ఆదుకున్న పంత్..
అనంతరం క్రీజులోకి మార్కస్ స్టోయినిస్ రాగా.. నిదానంగా ఆడిన పంత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సింగిల్స్ తీస్తూ మంచి బంతులను బౌండరీలకు తరలించిన ఈ జోడీ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసింది. కానీ మరోసారి హర్షల్ను రంగంలోకి దింపిన కోహ్లీ ఫలితాన్ని రాబట్టాడు. పంత్ వరుస ఫోర్లు బాదినా స్టోయినిస్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో హెట్మైర్ క్రీజులోకి రాగా.. సిరాజ్ వేసిన 15వ ఓవర్లో 6, 4 కొట్టి జోరు కనబర్చాడు. ఆ తర్వాత జేమీసన్, హర్షల్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 46 రన్స్ అవసరమయ్యాయి.
చెలరేగిన హెట్మైర్..
ఇక జేమీసన్ వేసిన 18వ ఓవర్లో మూడు భారీ సిక్సర్లు కొట్టిన హెట్మైర్ ఆశలు రెకెత్తించాడు. ఈ ఓవర్లో 21 రన్స్ రావడంతో ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 25 రన్స్ అవసరమయ్యాయి. హర్షల్ పటేల్ వేసిన 19 ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి హెట్మైర్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో 11 వచ్చాయి. దాంతో ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 14 రన్స్ అవసరం కాగా.. సిరాజ్ సూపర్ బౌలింగ్తో కట్టడి చేయడంతో 12 పరగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఒక్క పరుగుతో ఆర్సీబీ విజయాన్నందుకుంది.