
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఈ సీజన్లో తొలి సారి ఆ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. గత ఐదు మ్యాచ్ల్లోనూ ఆరెంజ్ ఆర్మీ తొలుత ఫీల్డింగే చేసింది. ఇక ఢిల్లీ పిచ్ బ్యాటింగ్కు పెద్ద కష్టమేమి కాదని ఈ నిర్ణయం తీసుకున్నానని సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. జట్లులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని సందీప్ శర్మ, మనీష్ పాండే జట్టులోకి వచ్చాడన్నాడు. విరాట్ సింగ్, అభిషేక్ శర్మలపై వేటు పడింది.
ఇక తాము టాస్ గెలిచినా ఫీల్డింగే తీసుకునేవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. డ్యూ ప్రభావం ఉందని ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తమ ఆటగాళ్లు తెలిపారన్నాడు. తాహీర్, డ్వేన్ బ్రావో స్థానాల్లో లుంగి ఎంగిడీ, మోయిన్ అలీ జట్టులోకి వచ్చారన్నాడు.
ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైన ధోనీ సేన ఆ తర్వాత బలంగా పుంజుకుంది. అనంతరం ఆడిన నాలుగు మ్యాచ్లలో ఆల్రౌండ్ ప్రదర్శన చేసి ఘన విజయాలు దక్కించుకుంది. ఈ మ్యాచ్లోనూ హైదరాబాద్ను చిత్తు చేసి తమ జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలించింది. ఢిల్లీతో గత మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓడిన ఆ జట్టు కనీసం ఈ మ్యాచ్నైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుంది. గత మూడేళ్లలో చెన్నై, హైదరాబాద్ 8 సార్లు తలపడగా.. ఆరు విజయాలతో ధోనీ సేన జోరుమీదుంది. ఒక్క 2018లోనే చెన్నై.. సన్రైజర్స్ను ఫైనల్తో సహా నాలుగు సార్లు ఓడించింది.
తుది జట్లు:
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, లుంగి ఎంగిడి, దీపక్ చహర్.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, జగదీష సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్.