ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే స్టేడియంలో నేడు(సోమవారం) జరిగే లీగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్ తొలి మ్యాచ్లో ఓడిన చెన్నై, రాజస్థాన్.. తమ సెకండ్ మ్యాచ్ల్లో అద్భుత విజయాలందుకున్నాయి. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఏకపక్ష విజయాన్నందుకుంటే.. ఢిల్లీతో జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం సాధించింది.
అదే జోరులో ఈ మ్యాచ్ను కూడా ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. పేపర్పై ఇరు జట్లు బలంగా ఉండటంతో మరోసారి హోరా హోరీ పోరు తప్పదు. అనుభవానికి దూకుడుకు మధ్య జరుగుతున్న ఈ పోరులో విజయం ఎవరికి దక్కుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అయితే ఈ మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. సీఎస్కే కెప్టెన్గా ధోనీకిది 200వ మ్యాచ్. ఇప్పటికే ప్లేయర్గా 200 మ్యాచ్లు ఆడిన ధోనీ.. చాంపియన్స్ టీ20 లీగ్లో ఓ మ్యాచ్ రైనా సారథ్యంలో ఆడాడు. దాంతో కెప్టెన్గా అతనికిది 200వ మ్యాచ్.
ఇక వికెట్ కీపర్గా ధోనీ మరో ఇద్దరిని ఔట్ చేస్తే 150 డిసిమిస్సల్స్ పూర్తి చేసుకుంటాడు. ఇందులో 39 స్టంపింగ్స్ ఉండగా.. 109 క్యాచ్లు ఉన్నాయి. ఇక సురేశ్ రైనా మరో రెండు సిక్స్లు కొడితే ఐపీఎల్లో 200 సిక్స్లు పూర్తి చేసుకుంటాడు. షార్దూల్ ఠాకూర్ మరో రెండు వికెట్లు తీస్తే ఐపీఎల్లో 50 వికెట్ల మార్క్ను అందుకుంటాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా.. 14 విజయాలతో చెన్నైసూపర్ కింగ్సే పైచేయి సాధించింది. రాజస్థాన్ 9 విజయాలకే పరిమితమైంది. అయితే 2015 తర్వాత ఇరు జట్లు హోరాహోరిగా తలపడ్డాయి. చెరో నాలుగు మ్యాచ్ల్లో గెలిచాయి. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో రెండు మ్యాచ్ల్లో రాజస్థాన్ విజయం సాధించింది.