
హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ రికార్డులు సృష్టించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల కన్నా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్కతా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్, హాట్ స్టార్ వ్యూస్ వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ కంటే ఎక్కవ ప్రేక్షకాదరణ ఈ మ్యాచ్ లభించడం విశేషం.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్కు ఉన్న అభిమాణ గణం, టీ20 ప్రపంచకప్ ముందు ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లీకి ఇదే చివరి సీజన్ కావడంతో ఇతర ఫ్రాంచైజీల అభిమానులు ఈ మ్యాచ్ను చూశారు. మాములుగా ఐపీఎల్ మ్యాచ్ జరిగితే డిస్నీ+హాట్ స్టార్లో 25 నుంచి 30 లక్షల మంది వీక్షిస్తారు. కానీ కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ను 63 లక్షల మంది వీక్షించారు. మ్యాచ్ ప్రారంభం నుంచే వీక్షకుల సంఖ్య 40 లక్షలు ఉండగా.. ఓ దశలో ఈ సంఖ్య 60 లక్షలు ధాటింది. నిలకడగా 57-60 లక్షల మంది వీక్షించారు. ఇక ఢిల్లీ, చెన్నై మధ్య జరిగిన క్వాలిఫయర్ 1లో ఈ సంఖ్య 50 లక్షలుగా నమోదైంది. ఏకకాంలో రెండు మ్యాచ్లు నిర్వహించగా.. ప్రేక్షకుల సంఖ్య ఓ మ్యాచ్కు 38 లక్షలు, మరో మ్యాచ్కు 16 లక్షలు నమోదైంది. దాంతో హాట్స్టార్ ఈ సీజన్ ఐపీఎల్లో రికార్డు స్థాయి వ్యూస్ అందుకుంది. ఇక టీఆర్పీ రేటింగ్స్లో కూడా స్టార్ స్పోర్ట్స్ చానెల్స్ దుమ్మురేపాయి.
గతానికి భిన్నంగా మెరుగైన రికార్డు సాధించాయి. అన్నీ భాషల్లో అందుబాటులో ఉండటం.. పైగా ఆయా రాష్ట్రలకు చెందిన క్రికెటర్లను కామెంటేటర్లుగా ఎంచుకోవడంతో పాటు ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ కార్యక్రమాలను నిర్వహించడం స్టార్ స్పోర్ట్స్కు కలిసొచ్చింది. చానెల్ మార్చకుండా చూసేలా చేసింది. రాను రాను ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 రన్స్ చేసింది. సునీల్ నరైన్(4/21) నాలుగు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. కేఎస్ భరత్(16 బంతుల్లో 9), విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 39), ఏబీ డివిలియర్స్(9 బంతుల్లో 11), గ్లేన్ మ్యాక్స్వెల్(18 బంతుల్లో 15)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కోల్కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసి రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(15 బంతుల్లో 3 సిక్సర్లతో 26) ధనాధన్ ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుభ్మన్ గిల్(18 బంతుల్లో 29), వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 26) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో చాహల్, సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు.