
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్ల ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ యూఏఈ వేదికగా జరిగే సెకండాఫ్ లీగ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్(RR) జట్టే శనివారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. జోస్ బట్లర్ భార్య లూయిస్.. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పుడు ఆమెకు తోడుగా ఉండాలని బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని రాజస్థాన్ ఫ్రాంచైజీ తెలిపింది.
'ఐపీఎల్ 2021 సెకండాఫ్కు జోస్ బట్లర్ అందుబాటులో ఉండటం లేదు. త్వరలో అతని సతీమణి లూయిస్ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. వారికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా రాయల్స్ ఫ్యామిలీ చేరే కొత్త వ్యక్తి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం'అని బట్లర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోను రాజస్థాన్ ట్వీట్ చేసింది. 2017 అక్టోబర్లో లూయిస్ వెబ్బర్నును బట్లర్ వివాహం చేసుకోగా వీరికి 2019లో ఓ అమ్మాయి పుట్టింది. మళ్లీ ఇప్పుడు లాయిస్ ప్రెగ్నెంట్ కాగా.. ఐపీఎల్ సెకండాఫ్ మధ్యలో ఆమె ప్రసవం కానుంది. కరోనా కఠిన ఆంక్షల నేపథ్యంలో మళ్లీ ఇంగ్లండ్ రావడం, తన సతీమణిని కలవడం కష్టమని భావించిన బట్లర్.. లీగ్కు దూరంగా ఉండాలని భావించినట్లు తెలస్లోంది.
భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఫస్టాఫ్ లీగ్లో ఏడు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అయితే కరోనాతో లీగ్ ఆగిపోయే ముందు ఆర్ఆర్ చివరి మ్యాచ్లో బట్లర్ 64 బంతుల్లో 124 పరుగులు చేశాడు. ఈ సీజన్లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన బట్లర్ 36.28 సగటుతో 254 రన్స్ చేశాడు. బట్లర్ స్థానంలో తీసుకునే ఆటగాడి వివరాలను రాజస్థాన్ రాయల్స్ వెల్లడించలేదు.
ఇప్పటికే గాయంతో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరంగా కాగా.. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. మానసిక సమస్యలతో స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా బట్లర్ కూడా దూరమవడంతో రాజస్థాన్ బలహీనంగా మారిపోయింది. ఇక యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా లీగ్ మలి దశ మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే సీఎస్కే, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అరబ్ గడ్డపై ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఇతర ఫ్రాంచైజీలు ఈ నెలాఖారులోపు యూఏఈకి పయనం కానున్నాయి.
ప్రస్తుతం బట్లర్ సొంతగడ్డపై భారత్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో ఆడుతున్నాడు. లార్డ్స్ టెస్ట్లో క్రీజులో పాతుకుపోయి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ మహమ్మద్ సిరాజ్ అతన్ని ఔట్ చేయడంతో భారత విజయం లాంఛనమైంది. రెండో టెస్ట్లో 151 పరుగులతో గెలిచిన భారత్ 5 టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది.