IPL 2021: గ్రౌండ్ క్లీనర్తో ఫిక్సింగ్కు ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్లో కొత్త తరహా ఫిక్సింగ్కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. కొన్ని మ్యాచ్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ షబ్బీర్ హుస్సేన్ బుధవారం వెల్లడించారు. మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలోనూ మ్యాచ్లు జరిగాయి. మ్యాచ్లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్ కార్డులు జారీ చేశారు. ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుకీలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

లవర్తో మాట్లాడుతున్నానని...
స్టేడియంలో ఒక మూలన అతన్ని చూసిన పోలీసులు ప్రశ్నించగా తన గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్లు బుకాయించాడు. అనుమానంతో అదే నంబర్కు మళ్లీ డయల్ చేయమని అడగ్గా, ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు. అతన్ని పట్టుకునే లోపే రెండు ఫోన్లను వదిలేసి పారిపోయాడు. మ్యాచ్ జరుగుతున్న అసలు సమయానికి, టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది. దీనిని వాడుకొని ప్రతీ బంతికి ఫిక్సింగ్ చేసేందుకు బుకీలు ప్రయత్నించారని షబ్బీర్ హుస్సేన్ తెలిపారు. బాల్ టు బాల్ బెట్టింగ్ కోసం సదరు క్లీనర్తో 'పిచ్-సైడింగ్'(గ్రౌండ్లో మ్యాచ్కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం) చేయించారని చెప్పారు.

దొంగ ఐపీఎల్ అక్రిడేషన్లు
ఢిల్లీలో జరిగిన ఓ మ్యాచ్లో దీన్ని గుర్తించామన్నారు. అయితే.. ఈ సీజన్లో 29 మ్యాచ్ల్లో పాల్గొన్న ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్పై కరప్షన్కు సంబంధించి ఫిర్యాదు రాలేదని హుస్సేన్ స్పష్టం చేశారు. ఇక మరో కేసు విచారణ సందర్భంగా దొంగ ఐపీఎల్ అక్రిడేషన్లు పొందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులను ఒక చోటికి చేర్చి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని షబ్బీర్ హుస్సేన్ తెలిపారు. అయితే, తప్పించుకున్న వ్యక్తి ఏ మ్యాచ్కు హాజరయ్యాడనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, పట్టుబడ్డ మరో ఇద్దరు ఈ నెల 2వ తేదీన హైదరాబాద్-రాజస్థాన్ మ్యాచ్కు ఫేక్ అక్రిడిటేషన్స్తో వచ్చారని తెలుస్తోంది.

బబుల్ను కమ్మేసిన కరోనా
సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021 లీగ్ను కరోనా కమ్మేసింది. అనూహ్యంగా బయో బబుల్లోకి ప్రవేశించి ఆటగాళ్లకు సోకింది. ఈ అనూహ్య పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కేకేఆర్, సీఎస్కే, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ జట్లలోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది వైరస్ బారిన పడడంతో.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ ముందు జాగ్రత్తగా లీగ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. లెక్కకు మించిన జాగ్రత్తలు తీసుకున్నా.. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించినా.. ఐపీఎల్ నిర్వాహకులు కరోనాకు అడ్డుకట్టవేయలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications