
చెన్నై: ఊహించినట్లుగానే ఐపీఎల్ 2021 వేలంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ.20 లక్షలకు దక్కించుకుంది. అర్జున్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడకపోవడంతో స్వల్ప ధరకే ముంబై సొంతం చేసుకుంది. అర్జున్ బిడ్తో ఐపీఎల్ 2021 మినీ వేలం ముగిసింది.
వేలంలో అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని భావించినా అలాంటిదేమీ జరగలేదు. అయితే ఆఖరి పేరు మాత్రం అతడిదే కావడం గమనార్హం. ఎడమచేతి వాటం పేస్ బౌలర్ అయిన అర్జున్.. వికెట్లు తీయడమే కాకుండా భారీ సిక్సర్లూ బాదగలడు. గతంలో టీమిండియా మహిళల జట్టు, ఇతర జట్లకు అతడు నెట్స్లో బౌలింగ్ చేశాడు.
ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దారుణంగా విఫలమైన అర్జున్ టెండూల్కర్.. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ముంబై సీనియర్ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక అర్జున్ టెండూల్కర్ను ముంబై ఇండియన్స్ తీసుకుంటుందని అభిమానులు ముందుగానే ఊహించారు. స్టార్ క్రికెటర్లతో ఉన్న ముంబై జట్టులో లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్కు అవకాశం దక్కడం అనుమానమే.