చెన్నై: టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు ఎట్టకేలకు ఐపీఎల్ ఆడే అవకాశం దక్కింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ క్యాష్ రిచ్ లీగ్ బరిలోకి దిగనున్నాడు. తాజా ఐపీఎల్ వేలంలో ఈ టీమిండియా నయావాల్ను చెన్నై సూపర్ కింగ్స్ అతని కనీస ధర రూ. 50 లక్షలకు తీసుకుంది.
పుజారా చివరిసారిగా 2014 సీజన్లో పంజాబ్ తరఫున బరిలో దిగాడు. ఆ తర్వాతి వరుసగా 6 సీజన్ల వేలంలో అతనికి నిరాశే ఎదురైంది. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చిన పుజారా.. తాజాగా ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లోను ఆకట్టుకున్నాడు. ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో తన శైలికి భిన్నంగా ధాటిగా ఆడాడు. అంతేకాకుండా తనకు ఐపీఎల్ ఆడాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. ఈ క్రమంలోనే చెన్నై అతన్ని తీసుకుంది.
ఇక పుజారా ఇప్పటి వరకు తన కెరీర్లో మొత్తం 30 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి.. 20.53 సగటుతో 390 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్రేట్ 99.74గా ఉంది. ఇక అతని సహచర టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారీకి మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది. రూ.1.50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న అతన్ని తొలి రౌండ్ వేలంలో తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు.
We welcome the legend, Che #Bujji with a super cute applause from the auction hall! #WhistlePodu #SuperAuction 🦁💛 pic.twitter.com/6RdJkKBy5O
— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021
తాజా వేలంలో ఫ్రాంచైజీలన్నీ ఆల్రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లవైపు మొగ్గు చూపుతుండటంతో వారికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే క్రిస్ మోరీస్ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. జై రిచర్డ్సన్ను పంజాబ్ కింగ్స్ రూ.14 కోట్లకు తీసుకుంది. ఇక ఆల్రౌండర్లు గ్లేన్ మ్యాక్స్వెల్ రూ.14.25 కోట్లు, షకీబ్ అల్ హసన్ 3.20 కోట్లు, మోయిన్ అలీ రూ. 7 కోట్లు, కృష్ణ ప్ప గౌతమ్ రూ.9.25 కోట్లు, కైల్ జెమీసన్ రూ.15 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయారు.