దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండాఫ్ ఫస్ట్ మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు తీవ్ర గాయంతో మైదానం వీడాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఆడమ్ మిల్నే వేసిన చివరి బంతి రాయుడు ఎడమ భుజానికి బలంగా తాకింది. దాంతో మైదానంలో కుప్పకూలిన రాయుడు నొప్పితో విలవిలలాడాడు. కొత్త బంతి కావడంతో వేగంగా దూసుకురావడంతో అతని ఎడమ భుజం వెంటనే వాచిపోయింది. మైదానంలోకి వచ్చిన ఫిజియో తీవ్రమైన గాయంగా గుర్తించాడు. దాంతో రాయుడు రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. ముందస్తు చర్యల్లో భాగంగా అతనికి స్కానింగ్ చేయవచ్చు. స్కానింగ్ టియర్ ఉన్నట్లు తేలితే మాత్రం రాయుడు మిగతా మ్యాచ్లు ఆడటం అనుమానమే. దాదాపు అతని కెరీర్ ముగిసినట్లే.
ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్(0) సిల్వర్ డక్గా వెనుదిరగ్గా.. రెండో ఓవర్లో మొయిన్ అలీ(0), మూడో ఓవర్లో సురేశ్ రైనా(4) పేలవ షాట్లతో పెవిలియన్ చేరారు. ఫాఫ్ డుప్లెసిస్ను ట్రెంట్ బౌల్ట్ తన స్వింగ్తో బోల్తా కొట్టించగా.. మొయిన్ అలీని ఆడమ్ మిల్నే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత రాయుడు(0) రిటైర్ట్ హర్ట్ అవ్వగా.. బౌల్ట్ బౌలింగ్లో రైనా అనవసర షాట్తో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో సీఎస్కే 7 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో జట్టును ఆదుకునేందుకు ధోనీ రంగంలోకి దిగగా.. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బౌండరీలతో స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. గైక్వాడ్ ఓవర్కో బౌండరీ బాదగా.. మరోవైపు ధోనీ(3) మిల్నే బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై పవర్ ప్లే ముగిసే సరికి 4 వికెట్లకు 24 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజాతో గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరు వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేయడంతో చెన్నై స్కోర్ బోర్డు నిదానంగా కదిలింది. చాహర్ వేసిన 9వ ఓవర్లో గైక్వాడ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను కీపర్ డికాక్ నేలపాలు చేశాడు. కృనాల్ వేసిన మరుసటి ఓవర్లో 9 పరుగులు రావడంతో చెన్నై 10 ఓవర్లు ముగిసే సరికి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది.