
ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజా సీజన్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తమ తదుపరి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం ఆడనుంది.
ఐపీఎల్ 2021 సీజన్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్తో చేరేందుకు ముంబైకి వెళ్లిన అక్షర్ పటేల్.. అక్కడే హోటల్లో ఏడు రోజుల క్వారంటైన్లో ఉన్నాడు. ఆ క్వారంటైన్కి వెళ్లే ముందు అతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. కానీ.. క్వారంటైన్లో ఉండగా నిర్వహించిన రెండో పరీక్షలో అతనికి పాజిటివ్గా తేలింది. దాంతో.. బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమ్కు దూరంగా 14 రోజులు అక్షర్ ఐసోలేషన్లో ఉన్నాడు. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అతను మళ్లీ టీమ్తో చేరాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత మ్యాచ్లో అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆఖరి ఓవర్లో ఓడిపోయింది. అయినప్పటికీ.. వెంటనే తప్పిదాల్ని దిద్దుకున్న ఆ జట్టు వరుసగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ను ఓడించి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్-4లో కొనసాగుతోంది.
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో అక్షర్ పటేల్ను ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులోకి తీసుకుంటే.. అప్పుడు రవిచంద్రన్ అశ్విన్ లేదా లలిత్ యాదవ్పై వేటు పడే అవకాశం ఉంది. చెన్నై వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో అశ్విన్ను కొనసాగించవచ్చు. అప్పుడు లలిత్ యాదవ్పై వేటు పడటం ఖాయం.