రస్సెల్ విధ్వంసం..
221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 31 రన్స్కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రస్సెల్ కోల్కతా శిబిరంలో ఆశలు రేపాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకొని ప్రమాదకరంగా మారిన రస్సెల్ను సామ్ కరన్ ఔట్ చేశాడు. అతను వేసిన 12వ ఓవర్ రెండో బంతికే ఆండ్రీ రస్సెల్ను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లెగ్ స్టంప్ను లక్ష్యంగా చేసుకుని సామ్ కరన్ బంతిని సంధించగా.. వైడ్గా వెళ్తుందనుకున్న రస్సెల్ కొద్దిగా ముందుకు జరిగాడు. కానీ.. అతని శరీరానికి అత్యంత సమీపం నుంచి వెనక్కి వెళ్లిన బంతి లెగ్ స్టంప్ను గీరాటేసింది. అప్పటి వరకూ బంతిని చక్కగా టైమింగ్ చేస్తూ సిక్సర్లు బాదిన రస్సెల్ ఆ తరహాలో సింపుల్ బాల్కి ఔటవతాడని ఎవరూ ఊహించలేదు. వికెట్ చేజార్చుకున్న తర్వాత చాలాసేపు పెవిలియన్కి వెళ్లకుండా అలానే దారిలోని మెట్లపై కూర్చుని రసెల్ బాధపడటం కనిపించింది. బహుశా లెగ్ స్టంప్ను తాను కవర్ చేశానని రసెల్ అనుకున్నట్లున్నాడు. ఈ వికెటే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. అతను మరో రెండు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. కేకేఆర్ విజయం సులువయ్యేది.
టాప్-5 విఫలం..
ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓటమికి టాపార్డర్ వైఫల్యం ఓ కారణం. 221 భారీ లక్ష్యాన్ని చేధించాలంటే మంచి ఆరంభం అవసరం. కానీ ఆ జట్టు దీపక్ చాహర్ ధాటికి ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్ శుభ్ మన్ గిల్(0) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నితీష్ రాణా(9), ఇయాన్ మోర్గాన్(7), సునీల్ నరైన్(4), రాహుల్ త్రిపాఠి(8) వరుసగా పెవిలియన్ చేరడంతో 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ తీవ్ర ఒత్తిడిలో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిడిలార్డర్లో ప్యాట్ కమిన్స్ (34 బాల్స్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్), రస్సెల్ (22 బాల్స్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54), దినేశ్ కార్తీక్ (24 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) చెలరేగిన టెయిలండర్ల సహకారం అందకపోవడంతో కేకేఆర్ ఓటమి చూడాల్సి వచ్చింది. టాప్-4లో ఒక్కరు మెరిసినా.. టెయిలండర్స్లో ఎవరైనా అండగా నిలిచినా ఫలితం మరోలా ఉండేది.
డెత్ ఓవర్లలో విఫలమైన కేకేఆర్
సీఎస్కే భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవడంలో కూడా కేకేఆర్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 17వ ఓవర్లో మొయిన్ అలీ ఔటైన తర్వాత చెన్నైని కట్టడి చేసే చాన్స్ కేకేఆర్కు లభించింది. కానీ ఆ టీమ్ బౌలర్లు పదే పదే లూజ్ డెలవరీలతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ చెలరేగేలా చేశారు. ప్రసిధ్ కృష్ణ ఒకే ఓవర్లో రెండు నోబాల్స్ వేయడం, ధోనీకి స్వేచ్చగా ఆడే అవకాశాన్ని ఇచ్చింది. ఆ ఓవర్లో 14 రన్స్ రాగా.. రస్సెల్ బౌలింగ్లో డూప్లెసిస్ హ్యాట్రిక్ ఫోర్స్ బాది 15 రన్స్ పిండుకున్నాడు. ఇక కమిన్స్ వేసిన చివరి ఓవర్లో డూప్లెసిస్ రెండు సిక్సర్లు బాదగా.. ఆఖరి బంతి ఆడిన జడేజా మరో సిక్సర్ బాదాడు. అయితే ఇది క్యాచ్గా వెళ్లగా.. బౌండరీ లైన్ వద్ద నితీష్ రాణా నేలపాలు చేయడమే కాకుండా సిక్సర్ను అడ్డుకోలేకపోయాడు. దాంతో చివరి ఓవర్లోనే 19 రన్స్ వచ్చాయి. సీఎస్కే 190 పరుగుల లోపే కట్టడి చేసుంటే కేకేఆర్ విజయం సులువయ్యేది.
పవర్ప్లేలో ఒక్క వికెట్ లేదు..
ఇక పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం కేకేఆర్ కొంపముంచింది. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(64), డుప్లెసిస్(95 నాటౌట్)ల జోడీని విడదీయడానికి కేకేఆర్ బౌలర్లకు 13 ఓవర్ల సమయం పట్టింది. వరుణ్ చక్రవర్తి వేసిన 13వ ఓవర్లో గైక్వాడ్.. కమిన్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఫస్ట్ వికెట్కు లభించిన 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సూపర్ స్టార్ట్తో క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్మన్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. భారీ షాట్లతో కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పవర్ప్లేలోనే ఓపెనింగ్ జోడీని విడదీసుంటే సీఎస్కే భారీ స్కోర్ చేసేది కాదు.