న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ల షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. భారత్ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా అర్దంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో లీగ్ను యూఏఈకి తరలించిన బీసీసీఐ.. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య 27 రోజుల్లో మిగిలిన 31 మ్యాచ్లను షెడ్యూల్ చేసింది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్తో ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్కు తెరలేవనుంది.
అబుదాబిలో కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య సెప్టెంబర్ 20న తొలి మ్యాచ్ జరగనుండగా.. షార్జాలో సెప్టెంబర్ 24న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్లో మొత్తం 13 మ్యాచ్లు జరగనుండగా.. షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 7 డబుల్ హెడర్స్ మ్యాచ్లు జరగనుండగా.. ఫస్ట్ మ్యాచ్ సాయంత్రం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.
లీగ్ దశ చివరి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అక్టోబర్ 8న జరగనుంది. తొలి క్వాలిఫయర్ అక్టోబర్ 10న దుబాయ్ వేదికగా, ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్ అక్టోబర్ 11, 13న షార్జా వేదికగా జరగనున్నాయి. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.