
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఓపెనర్ నితీష్ రాణా ( 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్తో 81) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 42 రన్స్కే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సహచర ఆటగాడు సునీల్ నరైన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 64)తో కలిసి ఆదుకున్నాడు. నాలుగో వికెట్కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే నితీష్ రాణా 'సురిందర్'అని రాసి ఉన్న కేకేఆర్ జెర్సీని చూపిస్తూ తన సూపర్ ఇన్నింగ్స్ను సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆకాశం వైపు చూస్తూ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ను సురిందర్కు అంకితం ఇస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అయితే రాణా అలా ఎందుకు చేశాడని, అసలు ఈ సురింధర్ ఎవరు? అని మ్యాచ్ చూసిన ప్రేక్షకులందరికి సందేహం కలిగింది.
ఈ విషయంపై కేకేఆర్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. సురింధర్.. రాణా మామని, అతని సతీమణి సాచ్చి మార్వా తండ్రని పేర్కొంది. ఆయన క్యాన్స్ర్తో శుక్రవారం మరణించాడని, దాంతోనే ఈ సూపర్ ఇన్నింగ్స్ను రాణా తన మామకు అంకితం ఇచ్చాడని స్పష్టం చేసింది. ఇక డగౌట్లోని ప్రతీ కేకేఆర్ సభ్యుడు నిలబడి రాణాకు సంఘీభావం తెలిపారు. సాచ్చి మార్వాతో రాణాకు గతేడాది ఫ్రిబవరి 19న వివాహం జరిగింది. ఐపీఎల్ ఆడుతున్న సందర్భంగా రాణా తన మామను కడసారి చూడలేకపోయాడు.
ఈ మ్యాచ్లో కోల్కతా నైటరైడర్స్ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. నితీష్ రాణా, సునీల్ నరైన్ సూపర్ బ్యాటింగ్కు తోడు ఇయాన్ మోర్గాన్(9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 17) మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడా, నోర్జ్, స్టోయినిస్ రెండేసి వికెట్లు తీశారు.