న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న సూర్య.. తన సత్తా ఏమిటో తెలియజేశాడన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కవ్వింపు చర్యలకు తనదైన శైలిలో బదులిచ్చాడని పేర్కొన్నాడు.
ఆ మ్యాచ్లో ముంబై ఇన్నింగ్స్ సందర్భంగా 13వ ఓవర్లో కోహ్లీ బంతిని చేతితో షైన్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు దిగాడు. అయితే అవేమీ పట్టించుకోని స్కై(సూర్య కుమార్ యాదవ్).. తన ఆటతోనే బదులిచ్చాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సూర్యకుమార్ ఏ ఒక్కరికో భయపడే రకం కాదనే విషయం కోహ్లీ అర్థమై ఉంటుందని ఎద్దేవా చేశాడు. స్కైని కవ్వించడం అంత తేలిక కాదని, అతను ఎవరికి భయపడే రకం కాదన్నాడు.
'అదొక అద్భుతమైన మ్యాచ్. అందులో సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. కోహ్లీకి తన సత్తా ఏమిటో సూర్యకుమార్ చూపించాడు. ఆస్ట్రేలియా టూర్కు సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయకపోవడాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా తనదైన ఆటతో చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక షాట్ను కోహ్లీ ఉన్న ప్లేస్లో ఆడాడు. ఆ సమయంలో స్కైని విరాట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దగ్గరగా వెళ్లి కనుచూపులతోనే కవ్వించాడు. కానీ అలాంటి వాటికి భయపడే రకాన్ని కాదనే విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో చెప్పాడు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇక సూర్యకుమార్ యాదవ్కు భారత జట్టులో చోటు దక్కడం గురించి మాట్లాడుతూ.. అతనికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశం వస్తుందన్నాడు. ఐపీఎల్ వంటి ఒక లీగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో పలువురు టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సెహ్వాగ్ ప్రస్తావించాడు. దీనికి వరుణ్ చక్రవర్తే ఒక ఉదాహరణ అని పేర్కొన్నాడు.
కరోనా కారణంగానే అతని సత్తాను అంచనా వేయలేకపోయాం: ధోనీ