
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ టైటిల్ స్పాన్సర్షిప్ రేసులోకి టాటా సన్స్ కంపెనీ దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఏమాత్రం ఊహించని మొత్తానికి బిడ్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక చైనా వస్తు బహిష్కరణ సెగతో టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకున్న విషయం తెలిసిందే. టైటిల్ స్పాన్సర్గా ప్రతీ ఏడాది రూ.440 కోట్లు చెల్లించిన వివో.. 2022 వరకు మొత్తం ఐదేళ్లపాటు ఒప్పందం చేసుకుంది. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఏడాదికి తమ ఒప్పందాన్ని ఉపసంహరించుకుంది. దీంతో బీసీసీఐ ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది.
అయితే ఈ డీల్ కాలపరిమితి (ఆగస్టు 18 నుంచి డిసెంబర్ 31) నాలుగున్నర నెలలు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. బిడ్లకు నేడే( ఆగస్టు 14) చివరి తేదీ అని ప్రకటించిన బీసీసీఐ.. స్పాన్సర్షిప్ కోసం బిడ్ వేసే కంపెనీ టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలనే నిబంధన పెట్టింది. ఆగస్టు 18న కొత్త స్పాన్సర్ ఎవరో ప్రకటిస్తామని తెలిపింది.
యోగా గురు రాందేవ్ బాబా పతంజలితో పాటు అమెజాన్, బైజూస్, డ్రీమ్ 11 తదితర కంపెనీలు కూడా స్పాన్సర్షిప్ కోసం పోటీపడుతున్నాయని ప్రచారం జరిగింది. కానీ నేటితో బిడ్ దాఖలు చేసే గడువు ముగియడంతో మొత్తం 5 కంపెనీలు మాత్రమే పోటీలో నిలిచాయని తెలుస్తోంది. టాటా సన్స్తో పాటు, బైజుస్, రిలయన్స్ జియో, పతంజలి, అన్ అకాడమీ రేసులో ఉన్నట్లు సమాచారం.
అన్ని కంపెనీలకన్నా టాటా సన్స్ కంపెనీనే భారీ మొత్తానికి బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వివో చెల్లించే రూ.440 కోట్లు చెల్లించేందుకు టాటా సన్స్ రెడీ అయిందని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం రూ. 250-275 కోట్లకు బిడ్ దాఖలు చేసిందంటున్నారు. ఏది ఏమైనప్పటికీ టాటా సన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ అనే ప్రచారం మాత్రం ఊపందుకుంది. ఇప్పటికే టాటా మోటార్స్ సెంట్రల్ స్పాన్సర్షిప్ కింద రూ.45-45 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తుంది. ఇక కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2020 సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనున్న విషయం తెలిసిందే.