
దుబాయ్: ఐపీఎల్ ఆడేందుకు తొందరపడవద్దని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇచ్చిన సలహాను లెక్కచేయకుండా మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. టీమిండియా అప్కమింగ్ ఆస్ట్రేలియా టూర్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్గా ఉండటం కంటే గుడ్ న్యూస్ ఏముంటుందని ఈ లెజెండరీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ గాయం విషయంలో ఇప్పటిదాకా జరిగింది పక్కనపెట్టాలని, బీసీసీఐ అతనికి మళ్లీ ఫిట్నెస్ టెస్ట్ చేయాలని సూచించాడు.
'రోహిత్ గాయం విషయంలో జరిగిందేదో జరిగింది. నా దృష్టిలో అతను ఫిట్గా ఉండటం కంటే గుడ్ న్యూస్ ఏముంటుంది. తొందరపాటు వల్ల రోహిత్ కెరీర్ డేంజర్లో పడుతుందని అందరూ ఆలోచించడం మంచి విషయం. కానీ ఇప్పుడు రోహిత్ ఫిట్గా, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. బౌండ్రీ రోప్ దగ్గర, 30 యార్డ్ సర్కిల్లో ఫీల్డింగ్ చేశాడు. ఫిట్గా ఉన్నానని ప్రూవ్ చేసుకునేందుకు ఓ మ్యాచ్ కూడా ఆడాడు. కావాలంటే బీసీసీఐ అతనికి మరోసారి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు. గాయం నుంచి రికవర్ అయ్యాక నెట్స్లో ఆడిన దానికి, మ్యాచ్కు చాలా తేడా ఉంటుంది. తాను ఫిట్గా ఉన్నానని సన్రైజర్స్తో మ్యాచ్కు ముందు, అయ్యాక రోహిత్ స్వయంగా చెప్పాడు. అందువల్ల గత విషయాలను పక్కనపెట్టడం మంచిదని'అని స్పోర్ట్స్ తక్తో మాట్లాడుతూ సన్నీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ ఆడేందుకు తొందరపడవద్దని, సుదీర్ఘ భవిష్యత్తు ఉందంటూ స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సలహా ఇచ్చిన రోజే రోహిత్ మైదానంలోకి దిగడం తీవ్రచర్చనీయాంశమైంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే.. లీగ్ ముఖ్యమా? అని భారత మాజీ చీఫ్ సెలక్టర్, మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ ప్రశ్నించారు. రోహిత్ గాయాన్ని అంచనా వేయడంలో బీసీసీఐ ఫిజియో పొరబడ్డారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్లో గాయపడ్డ హిట్ మ్యాన్ తర్వాత నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు రోహిత్ను పక్కనపెట్టారు. తొడ కండరాల గాయం కావడం.. అది తీవ్రంగా ఉండటంతో కనీసం 2-3 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని టీమిండియా ఫిజియో రిపోర్ట్ ఇవ్వడంతో సెలెక్టర్లు రోహిత్పై వేటు వేసారు. కానీ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగడంతో ఈ వ్యవహారం వివాదాస్పమైంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, రోహిత్ గాయంపై సీబీఐ దర్యాప్తు జరపాలని అభిమానులను డిమాండ్ చేస్తున్నారు.