దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. డివిలియర్స్ (22 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్లతో 55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో ఓడే మ్యాచ్లో ఆర్సీబీ సూపర్ విక్టరీ అందుకుంది. అయితే ఈ ఓటమి తమకు మింగుడు పడని పరిణామమని,రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. గెలిచే మ్యాచ్లో డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్తో ఓడామని తెలిపాడు. అయితే ఈ ఓటమితో తామేం నిరాశ చెందడం లేదని చెప్పుకొచ్చాడు.
'ఖచ్చితంగా ఈ ఓటమి మాకు మింగుడు పడని అంశం. ఆఖరి వరకు మేం గెలుపు రేసులో ఉన్నాం. కానీ ఏబీడీ మా విజయాన్ని లాగేసుకున్నాడు. అయితే ఈ ఓటమితో ఎలాంటి నిరాశకు గురవ్వడం లేదు. ఈ నెమ్మదైన వికెట్పై మేం మంచి స్కోర్ చేశాం. అలాగే ఆర్సీబీ బ్యాట్స్మెన్పై ఒత్తిడి తెచ్చాం. కానీ ఏబీడీ స్పెషల్ ఇన్నింగ్స్ ఆర్సీబీ గెలిచేలా చేసింది. పెద్ద మైదానం కావడంతోనే జయదేవ్ ఉనాద్కత్ను తీసుకొచ్చాం. స్లో వికెట్పై అతను అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. స్లోయర్ బాల్స్ వేయడంలో దిట్ట. కానీ ఏబీ విధ్వంసం ముందు పెద్ద బౌండరీలు కూడా చిన్నబోయాయి. ఇక మిడిల్ ఓవర్లలో నిలదొక్కుకొని బ్యాటింగ్ చేయాడాన్ని ఆస్వాదించా. అలాగే మాకు ఓ రిథమ్ కూడా లభించింది.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 57 ), రాబిన్ ఊతప్ప (22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 41) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆర్సీబీ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. ఏబీడీకి తోడుగా విరాట్ కోహ్లీ(32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 43), దేవదత్ పడిక్కల్( 37 బంతుల్లో 2 ఫోర్లతో 35) రాణించారు. ఈ గెలుపుతో ఆర్సీబీ మూడో స్థానంలోకి దూసుకెళ్లగా రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ సీజన్లో రాజస్థాన్పై ఆర్సీబీ రెండు మ్యాచ్లకు రెండు గెలిచింది.
పార్టీలు కాదు.. మా అగస్త్యా డైపర్లను మార్చుడు మిస్సవుతున్నా: హార్దిక్ పాండ్యా