దుబాయ్: రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని అబ్దుల్ సమద్ స్థానంలో విజయ్ శంకర్ను తీసుకున్నామన్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్లో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టులోకి ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చాడు. క్వారంటైన్ నుంచి వచ్చిన తాను నెట్స్లో తీవ్రంగా శ్రమించాడని కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. యశస్వీ జైస్వాల్, మహిపాల్ స్థానంలో రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చారన్నాడు.
తొలి రెండు మ్యాచ్ల్లో సంచలన విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడి ఢిలా పడింది. ఈ మ్యాచ్లో ఎలాగైన గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని భావిస్తోంది. మరోవైపు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ విజయ ఉత్సాహంలో ఉన్న హైదరాబాద్ తమ జైత్రయాత్రను కొనసాగించాలని పట్టుదలతో ఉంది.
బలబలాల పరంగా పేపర్పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ రాజస్థాన్ నిలకడలేమి బ్యాటింగ్ కారణంగా హైదరాబాద్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 11 సార్లు తలపడగా.. 6-5తో హైదరాబాద్ లీడ్లో ఉంది. చివరిసారిగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో హైదరాబాద్ నాలుగు గెలిచింది. గత సీజన్లో చెరొక మ్యాచ్ గెలిచాయి. 2014లో యూఏఈలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది.
తుది జట్లు:
సన్రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్(కీపర్), రాబిన్ ఊతప్ప, స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగీ, జోఫ్రా ఆర్చర్, వరుణ్ ఆరోన్