
దుబాయ్: ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్ తమకు క్వార్టర్ ఫైనల్ వంటిదని, సాయశక్తుల పోరాడుతామని సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఇక నాలుగో బెర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరి లీగ్ మ్యాచ్లో టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీకి మెరుగైన రన్రేట్తో 12 పాయింట్లున్నాయి. కాబట్టి ముంబైపై గెలిస్తే వార్నర్సేన మూడో ప్లేస్కు ఎగబాకి ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఆర్సీబీ నాలుగో స్థానానికి రానుండగా.. కోల్కతా ఐదో ప్లేస్కు పడిపోయి టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ రైజర్స్ ఓడితే మాత్రం కోల్కతా తన నాలుగో ప్లేస్ను నిలబెట్టుకొని లాస్ట్ బెర్త్ దక్కించుకోనుంది. దాంతో తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్రైజర్స్ అన్ని విధాలుగా సిద్దమైంది. ఇక తమ ఆటగాళ్ల ప్రాక్టీస్ వీడియోను సన్రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ వేదికగా పంచుకుంది.
ఈ వీడియోలో కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ఈ అవకాశన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని తమ అభిమానులకు మాట ఇచ్చాడు. 'ఇది మాకు చావో రేవో మ్యాచ్. క్వార్టర్ ఫైనల్ వంటింది. అద్భుత ప్రదర్శనలతోనే ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్టితుల్లో వదులుకోం. ఈ సీజన్ చాలా ఆసక్తికరంగా.. మంచి గడిచింది. ముఖ్యంగా తమ జట్టుకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో గెలవడం మాకు చాలా ముఖ్యం. బలమైన ముంబై ఇండియన్స్కు గట్టి పోటీ ఇవ్వడానికి సాయశక్తుల ప్రయత్నిస్తాం. జట్టంతా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంది.'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పట్ల సన్రైజర్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేన్ మామా హామీ ఇచ్చాడని, ఎలాంటి బెంగ అవసరం లేదని కామెంట్ చేస్తున్నారు.
గత రెండు మ్యాచ్ల్లో ఢిల్లీ, బెంగళూరును ఓడించి కాన్ఫిడెన్స్ పెంచుకున్న వార్నర్సేన అదే జోష్తో ముంబై పని పట్టాలని చూస్తోంది. అయితే ఇరు జట్ల మధ్య ఈ సీజన్ ఫస్టాఫ్లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 34 పరుగులతో ఓటమి పాలైంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అనేక ఇబ్బందుల తర్వాత చివరి దశలో రైజర్స్ టీమ్లో బ్యాలెన్స్ వచ్చింది. జానీ బెయిర్స్టోను పక్కనపెట్టాలన్న కీలక నిర్ణయం రైజర్స్ రాత మార్చిందని చెప్పొచ్చు. జానీ ప్లేస్లో ఓపెనర్గా వచ్చిన వృద్ధిమాన్ సాహా లాస్ట్ రెండు మ్యాచ్ల్లో అదరగొట్టగా.. ఖాళీ అయిన ఫారినర్ కోటాలో ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ రాకతో జట్టు బలం రెట్టింపైంది.