
షార్జా: ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మనీష్ పాండే అద్భుత ఫీల్డింగ్తో మైమరిపించాడు. బంతి కోసం అచ్చం చేప పిల్లాలానే దూకుతూ ఔరా అనిపించాడు. మనీష్ పాండే సూపర్ క్యాచ్కు ఇషాన్ కిషాన్(31) నిరాశగా పెవిలియన్ చేరాడు. సందీప్ శర్మ వేసిన 15 ఓవర్ చివరి బంతిని ఇషాన్ కిషాన్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే అద్భుత డైవ్తో క్యాచ్ అందుకున్నాడు.
పాండే ఫీల్డింగ్ విన్యాసానికి మైదానంలోని సహచర ఆటగాళ్లు, కామెంటేటర్లతో పాటు టీవీ ముందున్న ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. వాటే ఫీల్డింగ్ అంటూ కొనియాడారు. అయితే ఈ క్యాచ్కు ముందు పాండే బౌండరీ లైన్ వద్ద డికాక్ ఇచ్చిన క్యాచ్ను నేలపాలు చేశాడు. అంతేకాకుండా ఓ బౌండరీ ఆపడంలో విఫలమయ్యాడు. దాంతో బెస్ట్ ఫీల్డర్ అయిన మనీష్ పాండేకు ఏమైందని అంతా అనుకుంటుండగా.. తన మార్క్ ఫీల్డింగ్తో సత్తా చాటాడు.
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సిక్సర్ల మోత మోగించారు. క్వింటన్ డికాక్(67) హాఫ్ సెంచరీకి తోడు.. ఇషాన్ కిషన్(31), హార్దిక్ పాండ్యా(28), కీరన్ పోలార్డ్(25 నాటౌట్), కృనాల్(4 బంతుల్లో 20 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, కౌల్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే చివర్లో కౌల్ తేలిపోవడంతో ముంబై 200 మార్క్ను ధాటగలిగింది.
అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్కే పరిమితమై 34 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) రాణించినా ఫలితంలేకపోయింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.